Lokesh Kanagaraj: గత కొంత కాలం నుంచి సౌత్ ఇండియా నుంచి వస్తోన్న సినిమాలు దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ‘విక్రమ్’ సినిమాతో ఓ కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేసి పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడీ దర్శకుడి నుంచి రాబోయే సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ తో ‘లియో’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో భాగం అనే అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు మూవీ పై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఇప్పుడు లోకేష్ తదుపరి ప్రాజెక్టు గురించి గత రెండు రోజులుగా విపరీతంగా వార్తలు వస్తున్నాయి. లోకేష్ త్వరలో ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో కూడా సినిమాలు చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై దర్శకుడు లోకేష్ స్పందించాడు. 


ప్రభాస్, రామ్ చరణ్ లతో లోకేష్ టచ్ లో ఉన్నాడా?


‘విక్రమ్’ సినిమాతో లోకేష్ కనగరాజ్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్, రామ్ చరణ్ లాంటి బడా స్టార్స్ తో కూడా సినిమాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై ఇటీవల ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు లోకేష్. తన ‘ఖైదీ’ సినిమా నుంచి ఇలాంటి వార్తలు వస్తున్నాయని అన్నాడు లోకేష్. అయితే తాను ఆ వార్తలను అంతగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. అయితే ప్రభాస్, రామ్ చరణ్ తనకు మంచి స్నేహితులని, వారితో ఎప్పుడూ టచ్ లో ఉంటానని అన్నాడు. ఇప్పటి వరకూ వాళ్లను దృష్టిలో ఉంచుకొని కథలేమీ రాయలేదని స్పష్టం చేశాడు. అయితే వారితో కలసి పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేయాలని తనకూ ఉందని, కానీ వాళ్లు ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారని, తన చేతిలో కూడా ప్రస్తుతం ‘లియో’ సినిమా ఉందని, ప్రస్తుతానికి తన దృష్టి అంతా ఈ మూవీపైనే ఉందని చెప్పాడు లోకేష్. దీంతో ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలపై వస్తోన్న వార్తలకు చెక్ పడిందనే చెప్పాలి. అయితే అభిమానులు మాత్రం త్వరలో వీళ్ల కాంబో లో సినిమా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట.


లోకేష్ ‘లియో’ పై భారీ అంచనాలు.. 


ఇప్పుడు లోకేష్ కనగరాజ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన నుంచి రాబోతున్న విజయ్ హీరోగా ‘లియో’ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో భాగం అని అంటున్నారు. ఇప్పటికే విజయ్, లోకేష్ కాంబో లో వచ్చిన గత సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో లోకేష్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. 


Also Read: ప్రభాస్‌ సినిమాలో కమల్ హాసన్ - కన్ఫర్మ్ చేసిన 'ప్రాజెక్ట్ కె' టీమ్