తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తొలి తరం స్టార్ హీరోలు అయితే... వాళ్ళిద్దరి తర్వాత తరంలో వచ్చిన హీరోలలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న కథానాయకులలో కృష్ణం రాజు (Krishnam Raju) ఒకరు. వెండితెరపై మాత్రమే కాదు... నిజ జీవితంలోనూ కృష్ణంరాజు రెబల్ స్టార్. నటుడిగా ఎప్పుడూ ఆయన రారాజు.


కృష్ణం రాజు జనవరి 20, 1940న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయనది విజయనగర సామ్రాజ్య వారసుల కుటుంబం. ఆయన అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చిన వెంకట కృష్ణం రాజు. సినిమాల్లోకి వచ్చినప్పుడు... ఇంటి పేరులో 'శ్రీ', తల్లిదండ్రులు పెట్టిన పేరులో 'చిన వెంకట' పదాలను ఆయన తీసేశారు. ఉప్పలపాటి కృష్ణం రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
 
ఎస్.ఎస్.ఎల్.సి... పి.యు.సి... 
మొదటిసారి తప్పిన కృష్ణంరాజు
కృష్ణంరాజు విద్యాభ్యాసం మొగల్తూరులో మొదలైంది. ఎనిమిదో తరగతి వరకూ అక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత నర్సాపురం టైలర్ హైస్కూల్‌లో చేరారు. మళ్ళీ అక్కడ ఎనిమిదో తరగతిలో చేరారు. తొమ్మిది వరకు చదివారు. అల్లరి పెరగడం, బూతులు అలవాటు కావడంతో కొన్నాళ్ళు కాకినాడ పంపించారు. అక్కడ ఎస్.ఎస్.ఎల్.సి తప్పారు. దాంతో మళ్ళీ నర్సాపురం టైలర్ స్కూల్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత వై.ఎన్.ఆర్. కాలేజీలో చేరారు. అందులో పి.యు.సి. తప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ భద్రుకా కాలేజీ ఆఫ్ కామర్స్‌లో చేరారు. పి.యు.సి పాస్ అయ్యాక బీకామ్ చేశారు.


జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన కృష్ణం రాజు
కాలేజీ రోజుల్లో కృష్ణం రాజు అక్కినేని నాగేశ్వరరావు అభిమాని. 'సువర్ణ సుందరి'ని సుమారు 30 సార్లు చూశానని ఆయన ఒకసారి చెప్పారు. బీకామ్ చదువుతూ... 'ఆంధ్ర రత్న' పత్రికలో కృష్ణం రాజు జర్నలిస్టుగా చేశారు. ఆ పేపర్ ఆయనకు వరసకు బాబాయ్ అయ్యే మూర్తిరాజుది. అప్పుడు ఒకసారి అబిడ్స్ సెంటర్‌లో కాఫీ తాగుతున్న కృష్ణం రాజు దగ్గరకు వచ్చి 'అక్కా చెల్లెలు' తీసిన పద్మనాభ రావు 'సినిమాల్లో నటిస్తారా?' అని అడగటం, స్నేహితులు ప్రోత్సహించడంతో మద్రాస్ చేరుకున్నారు. ఆ సినిమా ప్రారంభం కాలేదు. వెనక్కి తిరిగి రావడానికి నామోషీగా ఫీలైన కృష్ణం రాజు... మద్రాస్ నగరంలో ఉండి అవకాశాల కోసం ప్రయత్నించారు. 'తేనె మనసులు' సినిమాకు ఆడిషన్ ఇచ్చారు. అందులో కృష్ణకు అవకాశం వస్తే... కృష్ణంరాజు రిజెక్ట్ అయ్యారు. అయినా అలా ప్రయత్నిస్తూ ఉన్నారు. 


'చిలక గోరింక'తో కెరీర్ స్టార్ట్...
మద్రాస్ నగరంలో కృష్ణం రాజుకు ప్రత్యగాత్మ పరిచయమయ్యారు. ఆయనే 'చిలక గోరింక'తో కృష్ణం రాజును హీరోగా పరిచయం చేశారు. 1966లో విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో చాలా నిరాశ చెందారు. కొన్నాళ్ళు నటనకు విరామం ఇచ్చారు. నటుడు సీహెచ్ నారాయణరావు వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. నటన గురించి పలువురు రాసిన పుస్తకాలు చదివారు. మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయలేదు. వాటిని వదులుకున్నారు. 


హీరోగా ఫ్లాప్ తర్వాత... విలన్‌గా ఎంట్రీ!
హీరోగా మొదటి సినిమాతో పరాజయాన్ని చూసిన కృష్ణం రాజు... ఆ తర్వాత విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. డూండీ నిర్మాణ సారథ్యంలో రూపొందిన 'అవే కళ్లు'  సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించారు. వరుస పెట్టి విలన్‌ వేషాలు వచ్చాయి. వాటన్నిటికీ ఆయన న్యాయం చేశారు. 


హీరో కావడం కోసం నిర్మాతగా మారిన కృష్ణం రాజు
ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను అలరించిన కృష్ణం రాజు... కథానాయకుడిగా మళ్ళీ తెలుగు తెరపై అడుగు పెట్టడం కోసం నిర్మాణంలోకి ప్రవేశించారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. 


నిర్మాతగా కృష్ణం రాజు తొలి సినిమా 'కృష్ణవేణి'. గోపీకృష్ణా మూవీస్ సంస్థ స్థాపించి ఆయన నిర్మించిన మొదటి చిత్రమది. నటుడిగా ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చింది. అయితే... అది లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఆ తర్వాత 'భక్త కన్నప్ప' చేశారు. ఆ తర్వాత కృష్ణం రాజు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. నటుడిగా పేరు, వరుస అవకాశాలు తీసుకు వచ్చింది 'భక్త కన్నప్ప'. 


Also Read : కృష్ణం రాజు రేర్ ఫోటోస్ - అప్పట్లో ఎలా ఉండేవారో చూడండి


పురస్కారాలు... భారీ విజయాలు!
'భక్త కన్నప్ప' తర్వాత కృష్ణం రాజు అనేక సినిమాలు చేశారు. 'అమర దీపం' సినిమా ఆయనకు నంది అవార్డు అందించింది. 'బొబ్బిలి బ్రహ్మన్న', 'తాండ్ర పాపారాయుడు', 'విశ్వనాథ నాయకుడు' వంటి సినిమాలు ఎన్నో చేశారు. 'పులిబిడ్డ', 'రంగూన్ రౌడీ', 'త్రిశూలం', 'బెబ్బులి', 'పులి బెబ్బులి', 'పలనాటి బ్రహ్మనాయుడు', 'విశ్వనాథ నాయకుడు', 'ఉగ్రనరసింహం', 'ధర్మాత్ముడు', 'ధర్మతేజ' తదితర సినిమాలు నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చాయి. 


'మా నాన్నకు పెళ్లి'తో సెకండ్ ఇన్నింగ్స్... 
కథానాయకుడిగా సూపర్ హిట్ కెరీర్ తర్వాత 'మా నాన్నకు పెళ్లి' సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అందులో శ్రీకాంత్ తండ్రిగా చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ 'సుల్తాన్‌', అనుష్క 'రుద్రమదేవి' తదితర సినిమాల్లో నటించారు. ఆయన నట వారసుడు ప్రభాస్ 'బిల్లా', 'రాధే శ్యామ్' సినిమాల్లో నటించారు. 


Also Read : రాజకీయాల్లోనూ రెబల్ స్టార్, ఓడిన చోటే నెగ్గి కేంద్ర మంత్రి అయిన కృష్ణంరాజు