‘ఆదిపురుష్’ మూవీపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర తెలుసుకోకుండా ‘రామయణం’ సినిమాను వక్రీకరిస్తున్నారని, క్రియేటివిటీ పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా ‘కేజీఎఫ్’ సినిమాలో కీలక పాత్ర పోషించిన కన్నడ నటి, బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ ‘ఆదిపురుష్’ టీజర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, ఎస్వీ రంగరావు నటించిన సినిమాలు చూసి నేర్చుకోవాలంటూ చురకలు వేశారు. 


‘‘వాల్మీకి రామాయణం, కంబ రామాయణం లేదా తులసీదాసు రామాయణాలను దర్శకుడు పరిశోధించకుండా వదిలిపెట్టినందుకు బాధగా ఉంది. చివరికి థాయ్‌లాండ్‌లో కూడా రామాయణాన్ని ఎంతో అందంగా ప్రదర్శించారు. కనీసం అతను గతంలో వచ్చిన మన సొంత చిత్రాలను పరిశీలించాలి. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో రావణుడికి ఎలా చూపించారో తెలుసుకోవాలి. రావణుడు ఎలా ఉన్నాడో అర్థం చేసుకోవడానికి దర్శకుడు ‘భూకైలాస్’లో ఎన్‌టి రామారావు లేదా డాక్టర్ రాజ్‌కుమార్‌లను చూసైనా తెలుసుకోవాలి. ‘సంపూర్ణ రామాయణం’లో ఎస్‌వి రంగారావును చూసి ఉండవచ్చు. నీలి కళ్లు, లెదర్ జాకెట్లు ధరించేవారు భారతీయులు కాదు. ‘రామాయణం’ అంటే మన దేశ గొప్పతనాన్ని తెలిపే చరిత్ర. సృజనాత్మక స్వేచ్ఛ ముసుగులో ఇలా చేయడం తగదు’’ అని తెలిపారు.  


ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్‌ను చూసి ప్రభాస్ అభిమానులే కాదు. దేశమంతా ఆశ్చర్యపోయింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు కార్టూన్ మూవీని తలపించాయి. రాముడి పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. కానీ, రావణుడి అవతారమే మరీ పొంతన లేకుండా ఉందని విమర్శలు వస్తున్నాయి. రావణుడి కళ్లకు కాటుక, నీలం కళ్లు, పొట్టి జుట్టు, లెదర్ జాకెట్ వేసుకోవడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. అతడు రావణుడిలా లేడని, అల్లావుద్దీన్ ఖిల్జీలా ఉన్నాడని అంటున్నారు. కొందరైతే రూ.500 కోట్లు పెట్టి కార్టూన్ రామాయణం తీస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే వానర సేనను కూడా అభ్యంతరకరంగా చూపించారని, VFX సీన్స్ మరీ అమీర్‌పేట గ్రాఫిక్స్‌లా ఉన్నాయని అంటున్నారు. 


‘ఆదిపురుష్’లోని రావణుడి అవతారంపై మాళవిక ట్విట్టర్‌లో కూడా స్పందించారు. ‘‘రావణుడు శివ భక్తుడు, బ్రాహ్మణుడు. 64 కళల్లో ఆరితేరినవాడు. వైకుంఠం కాపాలాదారుడు జయ(విజయ్) శాపం వల్ల రావణుడు అవతరించాడు. ఆదిపురుష్‌లోని రావణుడు టర్కిష్ నిరంకుశుడులా ఉన్నాడు. రావణుడిలా మాత్రం లేడు. మన రామాయణాన్ని, చరిత్రను వక్రీకరించుకోవడాన్ని బాలీవుడ్ మానుకోవాలి. మీరు ఎప్పుడైనా లెజెండ్ ఎన్టీఆర్ గురించి విన్నారా?’’ అని ప్రశ్నించారు.


తాజాగా మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా సైతం ‘ఆదిపురుష్’ టీజర్ చూసి మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా చిత్రీకరణ ఉందని, అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని కోరుతూ ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓమ్ రౌత్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ‘‘హిందూ మతానికి సంబంధించిన విశ్వాసాలను తప్పుగా చిత్రీకరిస్తూ నిందలు వేయడం సరికాదు. నేను దర్శకుడు ఓమ్ రౌత్‌కు లేఖ రాస్తున్నా. అందులోని అభ్యంతకర సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. మరి, దీనిపై ‘ఆదిపురుష్’ చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.