కన్నడ స్టార్ యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా 'కేజీఎఫ్2' సినిమా వచ్చింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అలానే బాలీవుడ్ స్టార్స్ రవీనా టాండన్, సంజయ్ దత్ లు కీలకపాత్రలు పోషించారు. 


ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద సినిమా అయినా.. విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లోకి వచ్చేస్తుంది. ఈ పైరసీను అడ్డుకోవడానికి చిత్రబృందం, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. అందుకే 'కేజీఎఫ్' టీమ్ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చాలా కష్టపడి సినిమాను రూపొందించామని.. థియేటర్లో ఫొటోలు, వీడియోలు తీయొద్దని రిక్వెస్ట్ చేసింది. 


''ఎనిమిదేళ్ల పాటు రక్తం, శ్రమ, కన్నీళ్లతో కేజీఎఫ్ సిరీస్ ను రూపొందించాం. కేజీఎఫ్ 2ని థియేటర్లో చూసేప్పుడు దయచేసి వీడియోలు రికార్డ్ చేసి వాటిని ఇంటర్నెట్ లో పెట్టొద్దు. అందఱూఈ సినిమాను థియేటర్లోనే చూసేలా సహకరించండి. పైరసీకి వ్యతిరేకంగా చేసే ఈ ఫైట్ మీతోనే మొదలవ్వాలి'' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Also Read: 'బీస్ట్' సినిమా టికెట్స్ కొంటే పెట్రోల్ ఫ్రీ - ఎక్కడో తెలుసా?