కేరళలో, 2017లో ఓ కథానాయికను లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమెను కిడ్నాప్‌ చేయించడానికి ప్రయత్నించారని మలయాళ నటుడు దిలీప్ మీద ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసులో తొలుత అరెస్ట్ అయిన దిలీప్‌కు, కొన్ని రోజుల తర్వాత బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే... ఆయన విచారణకు సహకరించడం లేదని, సాక్ష్యులను ప్రభావితం చేసేలా  వ్యవహరిస్తున్నారని పోలీసులు ఆరోపించారు.


పోలీసుల ఆరోపణలను దిలీప్ తోసిపుచ్చారు. పోలీసులు చెప్పేది కల్పితమని అన్నారు. దిలీప్‌కు వ్యతిరేకంగా కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత దిలీప్, అతని అనుచరులు ఫోనులు మార్చుకున్నారని కూడా ఆరోపించారు. విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారులను మార్చడానికి ప్రయత్నించారని అభియోగం మోపారు. ఈ కేసులో దిలీప్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.


పోలీసులకు సహకరించకపోవడం, సాక్ష్యులను ప్రభావితం చేయడం వంటి అంశాలను షరతులు విధించడం ద్వారా పరిష్కరించవచ్చని... ఒకవేళ దిలీప్ షరతులు ఉల్లంఘిస్తే, అతడిని అరెస్ట్ చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.


కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే... నటుడు దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై 2017లో కేసు నమోదు అయ్యింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించిన కథానాయిక కారులోకి ఇద్దరు ప్రవేశించి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు కిడ్నాప్ చేయడానికి కుట్ర పన్నారనేది అభియోగం. ఆమెను బ్లాక్ మెయిల్‌ చేయడం కోసం, నటుడి నుంచి విడాకులు కథానాయికను ఆమె సహకరించకుండా ఉండటం కోసం ఇలా ప్లాన్ చేశారనేది మాలీవుడ్ టాక్. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. అందులో దిలీప్ ఒకరు. ఆయన అరెస్ట్ కావడం, అప్పుడప్పుడూ బెయిల్ మీద విడుదలై బయటకు రావడం జరుగుతోంది.


ఇటీవల ఈ కేసు విషయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజ‌య‌న్‌కు సదరు నటి ఓ లేఖ రాశారు. ఇటీవల దర్శకుడు బాల చంద్రకుమార్ వెల్లడించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని విచారణ జరిపించాలని ఆమె కోరారు. దీనిపై ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. Koo App