Karthi: దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గతేడాది వచ్చిన ఇండియన్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ మూవీలలో ఒకటిగా నిలిచింది. ఇక ఏప్రిల్ 28 న ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదల కానుంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. అందులో భాగంగా హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాది ప్రేక్షకలకు ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఎందుకు అర్థం కాలేదు అనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 


అన్ని పాత్రలతో కంన్ఫ్యూజ్ అయ్యారు: కార్తీ


‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా హిస్టారికల్ యాక్షన్ మూవీ. ఇందులో చాలా పాత్రలు ఉంటాయి. ఎక్కువ పాత్రలు ఉండటంతో అర్థం చేసుకోవడానికి కష్టంగా మారింది. సాధారణంగా అనేక పాత్రలు ఉన్న ఏదైనా నవల చదివితే కొద్దిసేపటికి అందులో పాత్రలను మర్చిపోతూ ఉంటాం. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయితే ‘పీఎస్ 1’ ఓటీటీలో విడుదల అయిన తర్వాత హిందీ ప్రేక్షకులు బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రాబోయే ‘పిఎస్ 2’ ఉత్తరాది ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు కార్తీ. 


‘పీఎస్ 2’ విడుదలకు ముందే రికార్డులు..


‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ విడుదల అయిన తర్వాత ఎంతటి విజయాన్ని అందుకుందో తెలుసు. ఈ సినిమా తమిళనాట రికార్డులను తిరగ రాయడమే కాకుండా దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు రాబోయే ‘పీఎస్ 2’ సినిమా విడుదలకు ముందే రికార్డులను బద్దలుకొడుతుంది. ఈ మూవీను 4DX ఫార్మాట్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ ఫార్మాట్ విడుదల అవుతున్న తొలి దక్షిణాది మూవీ ఇదే కావడం విశేషం. అలాగే ఈ మూవీను ఐమాక్స్ ఫార్మాట్ లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ తరహా ప్రదర్శన ఇదే తొలిసారి కావడంతో ప్రేక్షకులు ఈ మూవీ రిలీజ్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. 


భారీ అంచనాల మధ్య ‘పీఎస్ 2’ రిలీజ్..


‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఒక్క తమిళనాడులోనే దాదాపు రూ. 200 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టి అక్కడ రికార్డు సృష్టించింది. మొదటి భాగం కంటే రెండో భాగం పై ప్రేక్షకుల్లో ఎక్కువ ఉత్కంఠ ఉంది. అందుకే ఈ సినిమా రెండో పార్ట్ భారీ వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అందుకే మూవీ ప్రమోషన్స్ ను కూడా భారీ రేంజ్ లో చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, నందిని, చియాన్ విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ, జయరామన్, నాజర్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ మూవీకు సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి సినిమాను నిర్మించారు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 


Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?