ఓటీటీలో వరాహరూపం సాంగ్ అప్ డేట్


కన్నడ సినిమా ‘కాంతార’ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. హొంబలే ఫిలింస్ నిర్మించిన ‘కాంతార’ మూవీ రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా తెరకెక్కింది. రూ. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లు వసూళ్లు చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘వరాహరూపం’ పాట కాపీ రైట్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ పాట తమ పాట నుంచి కాపీ కొట్టారంటూ తైక్కుడం బ్రిడ్జ్ ఆల్బమ్ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయ స్థానం ఈ పిటీషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ మేరకు వరహ రూపం పాట మీద ఉన్న బ్యాన్ ను న్యాయస్థానం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ లోనూ అప్ డేట్ అయ్యింది.


‘వరాహ రూపం’ పాట లేకుండానే ఓటీటీలో విడుదల


తాజాగా ‘కాంతార’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. అయితే, థియేటర్ లో అద్భుతంగా అలరించిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం జనాలను అంతగా ఆకట్టుకోలేదు.  దానికి కారణం ఈ సినిమా ‘‘వరాహ రూపం..’’ అనే పాట లేకపోవడం. దాని స్థానంలో అదే ట్యూన్‌లో మరో పాటను పెట్టారు. వాస్తవానికి వరాహ రూపం పాటను రీప్లేస్ చేయడానికి కీలక కారణం ఉంది. తైక్కుడం బ్రిడ్జ్ ఆల్బమ్ టీమ్ ఈ పాట ట్యూన్ తమదేనంటూ కోర్టును ఆశ్రయించింది. తమ ‘నవరస’ సాంగ్ నుంచే ‘వరాహ రూపం’ పాటను కాపీ చేశారని వెల్లడించింది. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం తొలుత ఆ పాటపై బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణ సంస్థ ఈ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసింది. అటు ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలోనూ ఆ పాటను తొలగించారు. మరో పాటతో ఈ పాటను రీప్లేస్ చేశారు. కానీ, అది సరిగ్గా మ్యాచ్ కాలేదు. 


తాజాగా వరాహ రూపం పాటపై బ్యాన్ ఎత్తివేత


గత కొద్ది రోజులుగా ఈ పాట వివాదం కోర్టులో నలుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ కేసును కేరళ న్యాయస్థానం పరిశీలించింది. వరాహ రూపం పాటపై ఉన్న బ్యాన్ ను తొలగిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో పాటు ఓటీటీలోనూ ఈ పాటను రీప్లేస్ చేసింది. మొత్తంగా ఇప్పుడు ‘కాంతార’ సినిమాను ఓటీటీలోనూ వరాహరూపం పాటతో అప్ డేట్ అయ్యింది. థియేటర్ అనుభూతిని ఇక ఓటీటీలోనూ పొందవచ్చు. ఇందుకు మీరు మరోసారి ఆ మూవీని యాప్‌లో ‘స్టార్ట్ ఓవర్’ చేసి చూడటమే. 


బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం


ఇక ‘కాంతార’ సినిమా ఓవరాల్ గా రూ. 400 కోట్ల రూపాయల వసూళ్లు సాధించగా, కర్నాటకలో రూ. 168 కోట్లు వసూళు చేసింది. తెలుగులో రూ. 60 కోట్లు రాబట్టింది. హిందీలో రూ. 96 కోట్లు, కేరళలో రూ.19 కోట్లు, తమిళనాడులో రూ.12 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 45 కోట్లు సాధించింది.  


Read Also: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!