Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్, 'తను వెడ్స్ మను' తర్వాత నటుడు ఆర్ మాధవన్‌తో మరోసారి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కి ప్రఖ్యాత ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ట్రైడెంట్ ఆర్ట్స్ సపోర్టుగా నిలుస్తుండగా.. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  ప్రముఖ నటీనటులు 8 సంవత్సరాల తర్వాత ఓ కొత్త పాన్ ఇండియన్ తమిళ చిత్రం కోసం మళ్లీ కలుస్తున్నట్లు కనిపిస్తోంది.


కంగనా రనౌత్, మాధవన్ 2011లో హిందీ చిత్రం 'తను వెడ్స్ మను'లో కలిసి నటించారు. ఈ చిత్రం వారిద్దరికీ ఎన్నో ప్రశంసలు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత 2015లో 'తను వెడ్స్ మను రిటర్న్స్‌'లో నటించారు. వారు అయోతి దర్శకుడు మంత్ర మూర్తి దర్శకత్వం వహించే కొత్త తమిళ చిత్రానికి సంతకం చేశారు. ట్రైడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. మరో పక్క ఈ వార్తలు నిజం కాదని, వీరిద్దరూ కలిసి నటించడం లేదని మరికొందరు అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.


ప్రస్తుతం వైరల్ అవుతున్న బజ్ ప్రకారం శశికుమార్, ప్రీతి అస్రాని నటించిన విమర్శకుల ప్రశంసలు పొందిన 'అయోతి'తో అరంగేట్రం చేసిన మంత్రిర మూర్తి తన రెండవ సంవత్సరం ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా కోసం కంగనా రనౌత్, మాధవన్‌లను సంప్రదించాడని, వారు కూడా ఆమోదం తెలిపారని సమాచారం. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ కొత్త చిత్రానికి ట్రైడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


ప్రస్తుతం, కంగనా తన రాబోయే తమిళ చిత్రం 'చంద్రముఖి 2' షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆమె మరో లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ' చిత్రీకరణను పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరోవైపు, మాధవన్ తన స్పోర్ట్స్ డ్రామా టెస్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 


గత కొన్ని రోజుల క్రితం హీరో మాధవన్, కంగనాపై ప్రశంసలు కురిపించారు. తనతో పని చేసిన వాళ్లలో చాలా మంది హీరోయిన్లు ధైర్యవంతమైన మహిళలని మాధవన్ అన్నారు. కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి, నటనను దూరం పెట్టే వారు కారని, సినీ రంగంలో వారికంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని చెప్పారు. తెరపై నటించాలంటే చాలా ధైర్యం కావాలన్న ఆయన.. ఈ విషయంలో కంగనాను ప్రశంసించాలన్నారు. ఆమె చాలా తెలివైన నటి అని, ఆమె ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తించుకునే ఎన్నో పాత్రలు పోషించిందని చెప్పారు. కేవలం ఒక్క తరహా పాత్రలకే పరిమితం కాకుండా.. భిన్న పాత్రల్లో నటిస్తూ.. విభిన్న చిత్రాల్లో నటిస్తోందని తెలిపారు. ఒక్కోసారి ఆమె నటనను చూసి తాను ఆశ్చర్యపోతుంటానని మాధవన్ వ్యాఖ్యానించారు.


Read Also : బుల్లితెర ప్రీమియర్‌కు సిద్ధమైన రక్షిత్ శెట్టి ‘777 చార్లీ’ - ఏ చానెల్‌లో అంటే..