Kangana Ranaut Interacts With Indira Gandhi: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాలో ఆమె దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతున్నారు. కంగన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం పోస్టు ప్రొక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఈ మూవీ  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


ఇందిరాతో కంగనా చిట్ చాట్


కంగనా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలో, ఆమె మాజీ ప్రధాని ఇందిరాతో కూర్చున్నట్లుగా ఉంది. వారిద్దరూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ కంగనా ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. లేటెస్ట్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో ఈ ఫోటో తీసినట్లు తెలిపారు. “ఐజీ(ఇందిరా గాంధీ)తో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అంటూ కంగనా ఈ ఫోటోను షేర్ చేశారు. కంగనా తాజా చిత్రంలో  ఇందిరా గాంధీ పాత్రకు చిత్రబృందం ఐజీ అని పేరు పెట్టింది. అటు ప్రధాని మోదీతో కూర్చొని చర్చిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను కూడా కంగనా షేర్ చేశారు. ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఈ ఫోటోలను తీసినట్లు ఆమె తెలిపారు.  






‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించిన కంగనా


దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు సంబంధించిన వివరాలతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తాజాగా ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. దీనికి  ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ అని పేరు పెట్టింది. ఇందులో సదరు ప్రధానులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరిచారు. తాజాగా ఈ కేంద్రాన్ని కంగనా సందర్శించారు. వీరాంగనా కీ మహాగాథ పేరుతో  పేరిట ఏర్పాటు చేసిన  లైట్‌ అండ్ సౌండ్‌ షోలో ఆమె పాల్గొన్నారు. “పురాతన, ఆధునిక విధానాల ద్వారా చరిత్రలోని అనేక అధ్యాయాలు ఈ షో ద్వారా చూపించారు. కుటుంబ సమేతంగా వచ్చి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందవచ్చు” అని కంగనా ఈ షో గురించి వెల్లడించారు.   


ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎమర్జెన్సీ’


కంగనా రనౌత్‌  స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా రూపొందుతోంది. దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.   మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టితో కలిసి కంగనా రనౌత్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాలో దివంగత నటుడు సతీష్ కౌశిక్, అనుపమ కేర్, శ్రేయస్ తల్పడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.


Read Also: లయ, నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, ఆ కారణంతో ఆగిపోయింది: సాయి కిరణ్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply