ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో షారుఖ్ గురించి చేసిన ఫన్నీ కామెంట్స్ కాంట్రవర్శీకి దారి తీశాయి. కింగ్ ఖాన్ తాజా మూవీ ‘పఠాన్’ కలెక్షన్స్ గురించి ఆమె అనుమానం వ్యక్తం చేయడం పట్ల షారుఖ్ అభిమానులు ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు.  


కొంతకాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘పఠాన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూళు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. అయితే, కొంతమంది ఈ కలెక్షన్స్ మీద అనుమానం వ్యక్తం చేశారు. ఇవి వాస్తవ లెక్కలు కాదని వాదించారు. షారుఖ్ ను లేపడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. షారుఖ్ అభిమానులు మాత్రం ఇవి కచ్చితమైన లెక్కలే అని వాదించారు. కొద్ది రోజుల పాటు నెట్టింట్లో తెగ చర్చ జరిగింది. నెమ్మదిగా ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోయారు.


‘పఠాన్’ కలెక్షన్స్ పై కాజోల్ వివాదాస్పద వ్యాఖ్యలు


తాజాగా కాజోల్ ఈ విషయాన్ని మళ్లీ  ప్రస్తావించింది. ‘పఠాన్’ మూవీ కలెక్షన్స్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మళ్లీ అనుమానాలకు తావిచ్చాయి. కాజోల్ నటించిన ‘ది ట్రయల్’ వెబ్‍సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా ‘‘మీరు, షారుఖ్‌ హిట్ పెయిర్ కదా.. షారుఖ్ ఖాన్ ఇప్పటికప్పుడు ఓ ప్రశ్న అడగాలి అనుకుంటే, ఏం అడుగుతారు? అని ప్రశ్నించారు. ఆమె ఏమాత్రం తడుముకోకుండా.. ‘‘నిజంగా ‘పఠాన్’ సినిమా ఎంత వసూలు చేసింది?” అని అడుగుతానని కాజోల్ చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో రచ్చకు కారణం అయ్యాయి.   


కాజోల్ వ్యాఖ్యలపై నెట్టింట్లో రచ్చ


ఇక ‘పఠాన్’ కలెక్షన్స్ నిజం కాదని కాజోల్ భావిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిత్రబృందం చెప్పిన లెక్కలను ఆమె నమ్మడం లేదంటున్నారు. ‘పఠాన్’ తప్పుడు లెక్కలను ఆమె బట్టబయలు చేసిందని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. అటు షారుఖ్ అభిమానులు మాత్రం కాజోల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్రోల్ చేస్తున్నారు.  


హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన కాజోల్, షారుఖ్ జంట


షారుఖ్- కాజోల్ బాలీవుడ్ లో సూపర్ హిట్ పెయిర్ గా కొనసాగారు. వీరిద్దరు కలిసి నటించిన చాలా సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలను ప్రేక్షకులు అప్పట్లో ఎంతో ఆసక్తితో చూసే వారు. ఇప్పుడు ఆమె ‘పఠాన్’ మూవీ కలెక్షన్లపై మాట్లాడ్డం షారుఖ్ అభిమానులకు నచ్చడం లేదు.


షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహాం, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ‘పఠాన్’ మూవీ ఈ ఏడాది జనవరి 25న విడుదల అయ్యింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ లెక్కలపై అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.


Read Also: షారుక్ ఒత్తిడితో ల్యాప్ టాప్ కొన్న అమీర్ ఖాన్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial