కైకాల సత్యనారాయణ(87) మరణ వార్త తెలుగు ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేసింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కైకాల సత్యనారాయణతో మెగాస్టార్ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. కైకాలతో కలసి మెగాస్టార్ ఎన్నో సినిమాల్లో నటించారు. కైకాల మరణంతో చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గతేడాది కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఆయన సతీమణి సురేఖతో కలసి కైకాల ఇంటికి వెళ్లారు. ఆయనతో గడిపిన చివరి క్షణాలను గుర్తుచేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ లేఖను విడుదల చేశారు.


‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యన్నారాయణ మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. కైకాల సత్యన్నారాయణ తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. సత్యన్నారాయణ పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు.


‘‘కైకాల సత్యన్నారాయణతో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను 'తమ్ముడూ' అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం. ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.


నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాల సత్యన్నారాయణకి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యన్నారాయణ సురేఖతో “అమ్మా ఉప్పు చేప వండి పంపించు" అని అన్నప్పుడు "మీరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం" అని అన్నాం. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోష పడిపోయారు.


కైకాల సత్యన్నారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ అంటూ చిరంజీవి ఎమోషనల్ నోట్ ను విడుదల చేశారు. 


Also Read: ధమాకా రివ్యూ - 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?


గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో విషాదఛాయలు అలముకున్నాయి. కైకాల పార్థివదేహాన్ని సినీ నటులు, అభిమానుల సందర్శనార్థం ఈరోజు ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు. రేపు(శనివారం) హైదరాబాద్ మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి.