ఇప్పటి వరకి నా ఇల్లు, నా తమ్ముళ్ళు మేమందరం కలిసి ఉంటామని ఎంతో సంబరపడిపోయాను కానీ రేపటి నుంచి ఎవరికి వారు విడిగా ఉంటారంటే ప్రాణం పోయినట్టుగా ఉందని రామా అఖిల్ దగ్గర బాధపడతాడు. అటు జానకి జెస్సి కడుపులోని బిడ్డ గురించి ఆందోళన పడుతుంది. ఇన్నాళ్ళూ కలిసి మనస్పూర్తిగా బతికాం ఇక నుంచి మనుషులుగా బతుకుతాం అనేసి రామా వెళ్ళిపోతాడు. జ్ఞానంబ జానకి చెప్పిన మాటల గురించి ఆలోచించి ఇంట్లో వాళ్ళందరిని పిలవమని చికితకి చెప్తుంది. అందరూ బాధగా ఉంటే మల్లిక మాత్రం విడిపోతున్ననందుకు తెగ సంబరపడిపోతుంది. విడిపోతున్నందుకు నీ నిర్ణయం చెప్పడానికి అందరినీ పిలిచావా అని గోవిందరాజులు అడుగుతాడు.


జ్ఞానంబ: నిర్ణయం ఏదైనా అందరూ పాటించక తప్పదు. విష్ణు, అఖిల్ మారతారు పరిస్థితి అర్థం చేసుకుంటారని మీరు చెప్పిన నాకైతే నమ్మకం లేదు. వీళ్ళ బుద్ధి కుక్కతోక లాంటిది ఎంత సక్రమంగా చేయాలని చూసిన అది వంకరగానే ఉంటుంది. మన ఆవేశం పుట్టబోయే బిడ్డల బంగారు భవిష్యత్ పాడయ్యే అవకాశం ఉంది. వీళ్ళు చేసిన తప్పులకి ఆ పసికందులకి శిక్ష వేయకూడదు. ఇంటి బాధ్యతని భుజాన వేసుకున్న రామా, జానకి మాటలు కాదనలేక, విడిపోవాలని అనుకున్న వాళ్ళ మనసు మారుస్తాను అని జానకి నమ్మకంగా చెప్పింది కాబట్టి మొన్న నేను చెప్పిన నిర్ణయం మార్చుకున్నా కుటుంబం కలిసి ఉండటానికి ఒప్పుకుంటున్నా అంటుంది. ఆ మాటకి మల్లిక తప్ప ఇంట్లో అందరూ సంతోషిస్తారు.


Also read: మోడ్రన్ డ్రెస్ వేసి చిందులు వేసిన తులసి, సామ్రాట్ - తప్పు చేశావన్న అనసూయ


జానకి అడిగిన మూడు నెలల గడువులోగా వాళ్ళలో మార్పు రాకపోతే ఆ తర్వాత ఆ దేవుడు చెప్పినా కూడా వాటాలుగా విడిపోవడం జరుగుతుందని జ్ఞానంబ తేల్చి చెప్పేస్తుంది.  అఖిల్, విష్ణు బావగారు మారితే బాగుందని జెస్సి మనసులో కోరుకుంటుంది. సిటీకి వెళ్ళి హాయిగా బతకొచ్చు అని నేను మనసులో తీన్మార్ డాన్స్ వేస్తుంటే కలిసిఉందామని చెప్పి పోలేరమ్మ షాక్ ఇచ్చింది ఏంటని మల్లిక తిట్టుకుంటుంది. చికిత, వెన్నెల, గోవిందరాజులు కలిసి మల్లికని ఒక ఆట ఆడుకుంటారు. ఇక రామా అయితే సంతోషం పట్టలేక జానకిని ఎత్తుకుని తిప్పి తెగ ముద్దులు పెట్టేస్తాడు. జెస్సి కళ్ళు తిరిగి కిందపడిపోయిందని చికిత వచ్చి రామా వాళ్ళకి చెప్తుంది. ఇంట్లో అందరూ జెస్సి గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే జానకి డాక్టర్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది.


జెస్సి మీద నీళ్ళు చల్లడంతో కళ్ళు తెరుస్తుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. డాక్టర్ వస్తే నా దొంగ ప్రెగ్నెన్సీ బయటపడిపోతుంది వెంటనే ఇక్కడ నుంచి జారుకోవాలి అని వెళ్లబోతుంటే జ్ఞానంబ ఆపి గ్లూకోజ్ వాటర్ కలిపి తీసుకురమ్మని చెప్తుంది. డాక్టర్ వచ్చి జెస్సిని చెకప్ చేస్తుంది.


Also Read: అందరి అనుమానాలని నిజం చేస్తానంటున్న మాధవ్- దేవి ఆచూకీ తెలుసుకున్న రుక్మిణి, ఆదిత్య


తరువాయి భాగంలో..


జెస్సిని చూసిన తర్వాత జానకి మల్లిక కూడా కడుపుతో ఉందని చెకప్ చెయ్యమని డాక్టర్ కి చెప్తుంది. తన నుంచి తప్పించుకోవడానికి మల్లిక చెట్టు ఎక్కి కూర్చుంటుంది. జానకి వెతుక్కుంటూ వచ్చి మల్లికని చెట్టు నుంచి దింపి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లబోతుంటే మళ్ళీ తప్పించుకుంటుంది. దీంతో జానకి అసలు నిజంగా మల్లిక కడుపుతో ఉందా లేదంటే కావాలని డ్రామా ఆడుతుందా అని అనుమానపడుతుంది.