ఐటీ అధికారులు మరోసారి సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా పెద్ద నిర్మాణ సంస్థలపై ఓ కన్నువేసి ఉంచిన ఐటీశాఖ అధికారులు తాజాగా రంగంలోకి దిగారు. పలువురు నిర్మాతలు, దర్శకుల ఇళ్లపై దాడులకు దిగారు. ప్రస్తుతం వరుస హిట్ సినిమాలతో జోష్ మీదున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవి శంకర్, నవీన్ నివాసాలు, కార్యాలయాలతోపాటు, దర్శకుడు సుకుమార్ ఇంటిపైనా ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. బంజారాహిల్స్, మాదాపూర్ జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.


సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు


మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను నిర్మించింది. నందమూరి బాలకృష్ణతో కలిసి ‘వీర సింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు తీసింది. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. ఈ సినిమాలతోపాటు వరుసగా స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప 2’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అంతేకాదు, ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ మైత్రిమూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలకు భాగస్వామిగా కొనసాగుతున్నారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలను  సైతం చూసుకుంటున్నారు.


సుకుమార్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారుల ఫోకస్


ఈ టైంలో ఐటీ అధికారులు సుకుమార్ ఆర్థిక వ్యవహారాలపై కూడా దృష్టి పెట్టారు.  పెద్ద మొత్తంలో సుకుమార్ ఆర్థిక వ్యవహారాల్లో భాగం అయ్యారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సుకుమార్ నివాసంతో పాటు కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు దాడులకు దిగారు. ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల గురించి సుకుమార్ నుంచి వివరాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌  నిర్మించిన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు విడుదలయ్యే సమయంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్మహించారు. కాగా,  మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ హీరోలతో వరుసగా ప్రతిష్టాత్మక చిత్రాలు తీయడంతో పాటు, డిస్ట్రిబ్యూషన్ సంస్థను రన్ చేస్తోంది.   


పుష్ప 2’ నిర్మాణంలో బిజీగా ఉన్న సుకుమార్


ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా ‘పుష్ప 2’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంతో రూపొందిన ‘పుష్ప’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా భారీగా వసూళ్లు సాధించింది. ఇక ప్రస్తుతం సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా తెరకెక్కిన సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కి రెడీ అవుతోంది. గతంలో దిల్ రాజు ఆఫీస్, హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థలపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.   


Read Also: సెన్సార్ రిపోర్ట్: ‘విరూపాక్ష’కు A సర్టిఫికేట్ - సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌ లో కూర్చోబెడుతుందట!