నిఖిల్ హీరోగా తెరెక్కిన తాజా చిత్రం కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఆగస్టు 13న జనాల ముందుకు వచ్చిన ఈ సినిమా చాలా తక్కువ థియేటర్లు, స్కీన్లపై విడుదలైంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం క్రమేనా థియేటర్లు, షోస్ సంఖ్య పెంచారు. దీంతో ఈ సినిమాకు అనూహ్యంగా కలెక్షన్స్ రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా దుమ్మురేపుతోంది. అక్కడి మీడియా నుంచి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘ఇస్కాన్’కు చెందిన రాధా మాధవ్ సభ్యులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 


అద్భుత సినిమాని తెరకెక్కించి చిత్ర బృందాన్ని ‘ఇస్కాన్ కాల్గరీ’ అభినందించింది. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపింది. 1984లో సముద్ర గర్భంలో ద్వారక నగరాన్ని భారతీయ పురావస్తు శాఖ కనిపెట్టిన విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చూపించడం సంతోషకరమని అభివర్ణించింది. శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా  ‘కార్తికేయ-2’ సినిమాను తెరకెక్కించడంపై ఇస్కాన్ ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు భారతీయ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చినట్లు ఇస్కాన్ సంస్థ వెల్లడించింది. భారతం, రామాయణలపై  ఇంకా అద్భుతమైన సినిమాలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. శ్రీ కృష్ణుడి తత్వం, ఫిలాసఫీతో పాటు ఆయన బోధనల సారాంశాన్ని తీసుకుని మున్ముందు ఇలాంటి సినిమాలు రూపొందించాలని ఇస్కాన్ ఆకాంక్షించింది.


ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ‘కార్తికేయ-2’ మూవీపై ఇటీవల స్పందించారు. ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌‌కు రావాలంటూ ఆయన ఆహ్వానాన్ని అందించారు. ఇస్కాన్ దేవాలయాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్నాయి. అన్ని చోట్లా అద్భుత రీతిలో ధార్మిక కార్యక్రమాలు కొనసాగిస్తుంది ఈ సంస్థ. ఇస్కాన్ సంస్థ నుంచి అరుదైన ఆహ్వానం రావడం పట్ల ఇప్పటికే చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఇది తమకు దక్కిన గౌరవంగా అభిప్రాయపడింది. 


తొలుత తక్కువ స్క్రీన్లలో విడుదలైనా.. మౌత్ పబ్లిసిటీతో ఆ తర్వాత జోరుగా పుంజుకుంది. విజువల్స్, కంటెంట్ అద్భుతంగా ఉండటంతో  జనాలు నెమ్మదిగా ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం చెప్పుకోదగిన సినిమాలేవీ థియేటర్లలో లేవు. తెలుగులో ‘బింబిసార’, ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు విడుదలై వారం రోజులు కావడంతో కార్తికేయ-2 కలెక్షన్స్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. ‘మాచర్ల నియోజవర్గం’ ఫ్లాప్ టాక్ ‘కార్తికేయ-2’కు కలిసొచ్చింది. తొలి ఆట నుంచే  పాజిటివ్ టాక్ రావడంతో జనాలు ఈ సినిమా వైపు మళ్లారు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించింది. అనుపమ్ ఖేర్ తమ పాత్రలో జీవించారు. ఈ వారం కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ‘కార్తీకేయ-2’ హవా కొనసాగనుంది. 


Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ


Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?