ప్రస్తుతం మనదేశంలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప 2: ది రూల్’ ఒకటి. 2021లో విడుదల అయిన ‘పుష్ప: ది రైజ్’కు డైరెక్ట్ సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ‘పుష్ప 2’ ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తెరదించుతూ రిలీజ్ డేట్‌ను నిర్మాతలు విడుదల చేశారు. 2024 ఆగస్టు 15వ తేదీన ‘పుష్ప 2: ది రూల్’ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.






‘పుష్ప 1’ సినిమాకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్రకు ఎక్కారు. ఇన్నేళ్ల తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇంతవరకూ ఒక్క నటుడికి కూడా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు రాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల నుంచి అల్లు అర్జున్‌కు గట్టి పోటీ ఎదురైంది. దీంతో ‘పుష్ప2: ది రూల్’పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.


ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్‌కు కూడా జాతీయ అవార్డు వచ్చింది. ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా ఊఊ అంటావా’, ‘దాక్కో దాక్కో మేకా’, ‘సామి’, ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ ఇలా అన్ని పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి.


‘పుష్ప 2’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ‘పుష్ప 2’ సెట్ కు సంబంధించిన ఫోటోను హీరోయిన్ రష్మిక మందన్నతన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫొటోను బట్టి ఇందులో కనిపిస్తున్న భారీ భవంతిలో రష్మిక, అల్లు అర్జున్ మధ్య సీన్లు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఫ్యామిలీ సీన్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ‘పుష్ప2’ నుంచి పలు సీన్లకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. తాజాగా ‘పుష్ప 2’ మూవీ లారీలు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా  హీరోయిన్ రష్మిక సెట్ ఫోటో రిలీజ్ చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది.


ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు ఇప్పటికే షూట్ చేశారట. చాలా వరకు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాలని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది చివర్లోనే ‘పుష్ఫ 2’ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సినిమాపై మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప 2’ సినిమాని  మైత్రీ మూవీ మేకర్స్,  సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial