మూడున్నర దశాబ్దాల క్రితం విడుదలైన అద్భుత చిత్రం ‘నాయగన్’. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించగా, దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. భారీగా వసూళ్ల వర్షం కురిపించింది. వీరిద్దరి కాంబోలో మళ్లీ ఇన్నేళ్లకు ఓ సినిమా తెరకెక్కబోతోంది. 'KH 234' తాత్కాలిక పేరుతో ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చేయబోతున్నట్లు కమల్ వెల్లడించారు. కచ్చితంగా ‘నాయగన్’ లాంటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు.  


ఇప్పటికే కమల్ హాసన్ తో సినిమాలు చేసిన త్రిష


అటు వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో త్రిష లేదంటే నయనతార హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే త్రిష కమల్ హాసన్ తో రెండు సినిమాలు చేసింది. అందులో ఒకటి ‘మన్మధన్ అంబు'  మరొకటి 'తూంగవనం'. ఈ చిత్రంలోనూ ఎంపిక అయితే ముచ్చటగా మూడో చిత్రం అవుతుంది.  ఒకవేళ నయనతార ఫిక్స్ అయితే, కమల్ తో ఆమె చేయబోయే సినిమా ఇదే మొదటిది అవుతుంది.  


హీరోయిన్ పారితోషికం రూ. 12 కోట్లు


ఇక ఈ సినిమాలో హీరోయిన్ పారితోషికం విషయంలోనూ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారట. హీరోయిన్ త్రిష అయినా, నయనతార అయినా రూ. 12 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నారట. నిజానికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతార చలామణి అవుతోంది. ‘జవాన్’ సహా పలు సినిమాలకు ఆమె రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. అయితే, ఇప్పుడు కమల్ హాసన్ సినిమాలో హీరోయిన్ కు రూ. 12 కోట్లు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి నయనతారతో పాటు త్రిషతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. ఇద్దరిలో ఎవరు అనే విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది.


'KH 234' హీరోయిన్ ఎవరు?


నిజానికి ప్రస్తుతం న‌య‌న‌తార‌ తర్వాత అదే స్థాయిలో గుర్తింపు ఉన్న నటి త్రిష. అందం, అభినయంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘జవాన్’ తర్వాత నయతార రేంజి మరింత పెరిగింది. అయితే, త్రిషకు నార్త్ లో పెద్దగా గుర్తింపు లేదు. కొన్ని హిందీ సినిమాలు చేసినా మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. ఒకవేళ ఈ సినిమాలో తను నటిస్తే సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా రికార్డు సాధించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ అద్భుత అవకాశాన్ని దక్కించుకునేది ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!   


Read Also: శ్రద్ధా, పూజా హెగ్డే మాత్రమే కాదు... సోనాల్ చౌహన్ కూడా - కొత్త కారు కొన్న హీరోయిన్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial