సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. టీజర్ కొత్తగా ఉత్కంఠ రేపే విధంగా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ సినిమాతో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.


విరూపాక్షను ఎన్టీఆర్ ఎందుకు ప్రమోట్ చేశారంటే?


ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు  జూనియర్ ఎన్టీఆర్ సైతం బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ఈ సినిమాకు ఎందుకు సపోర్టు చేస్తున్నారో సాయి వివరించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆయన ఆకాంక్షించారు. అంతేకాదు, సాయికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆయన ఈ సినిమా గురించి ఈ స్థాయిలో ప్రచారం చేయడం పట్ల సినీ అభిమానులు ఆశ్చర్యపోయారు.


ఇండస్ట్రీకి రాక ముందే ఎన్టీఆర్, నేను మంచి మిత్రులం


ఈ విషయం గురించి తాజాగా సాయి ధరమ్ తేజ రెస్పాండ్ అయ్యారు.  ''చరణ్‌, చిరంజీవి మామయ్య, బన్నీ సహా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు తమవంతు కృషి చేశారు. నా సినిమాకి మరింత ప్రచారం తీసుకురావాలి అనుకున్నాను. ఇదే విషయాన్ని మిత్రుడు ఎన్టీఆర్ కు చెప్పాను. తను అంగీకరించారు. నేను ఇండస్ట్రీకి రాకముందు కూడా అతను నాకు చాలా మంచి ఫ్రెండ్. నా శ్రేయోభిలాషి కూడా. ఈ సినిమాతో నన్ను మళ్లీ ఇండస్ట్రీకి పరిచయం చేయమని అడిగాను. నాతో ఉన్న క్లోజ్ నెస్ కారణంగా తను ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మా గురించి ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకుంటారు.  కానీ తెలుగు చిత్ర పరిశ్రమగా అందరం కలిసి ఒక్కటిగా ఉన్నాము. అతడు నన్ను ప్రోత్సహించడం వల్ల పరిశ్రమకు కూడా మంచే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు.


అటు ఆస్కార్ అవార్డు గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  ''చిన్నప్పుడు నేను, చరణ్ స్టార్ వార్స్ లాంటి హాలీవుడ్ సినిమాలు, ఇతర స్పేస్ సినిమాలు చూసేవాళ్ళం. హాలీవుడ్ లెవల్ లో సినిమాలు తీయాలని ఎప్పుడూ చెప్పుకునేవాళ్లం.  తెలుగు సినిమాలు ఇప్పుడు ఆస్కార్ అవార్డులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమకు ఆస్కార్ అవార్డుల మార్గాన్ని సుగమం చేశారు” అన్నారు.   


విరూపాక్ష’పై సాయి ధరమ్ తేజ ఆశలు


ఇక హీరో సాయి ధరమ్ తేజ్  ‘విరూపాక్ష’ సినిమాపై మంచి హోప్స్ తో ఉన్నారు. ఆయన గతంలో నటించిన మూవీలు అంతగా ఆకట్టుకోవపోవడంతో ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు.  ఈ సినిమాలో నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.






Read Also: క్రికెటర్ ముత్తయ్యకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ‘800‘ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్