ఇంటికి రానన్ని అవసరమైతే కాళ్ళు పట్టుకోవడానికి అయినా సిద్ధమే అని పరంధామయ్య అనసూయ కాళ్ళ మీద పడబోతాడు. దీంతో అనసూయ దిగాలుగా ఇంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తన వెనుకాలే తులసి పరుగులు తీస్తుంది. అనసూయ నడుచుకుంటూ ఒక నూతిలో దూకడానికి వెళ్తుంటే తులసి పరుగున వచ్చి ఆపుతుంది. తనని వెనక్కి తీసుకుని వెళ్తుంది. నందు ఇంటికి వచ్చినట్టు అభి లాస్యకి మెసేజ్ చేస్తాడు. మావయ్య బయటకి వెళ్లారని తులసి చెప్పమని లాస్యకి చెప్తుంది. ఇక ప్రేమ్,శ్రుతి, లాస్య ఇంటికి వస్తారు. నందు కోపంగా వారి వైపు చూసి గుడికి వెళ్ళినట్టుగా లేరు మీరు ఏమైంది ఎక్కడ నుంచి వస్తున్నారు, మీ మొహాలు చూస్తుంటే ఏదో జరిగిందని అర్థం అయ్యింది, దాచకుండా చెప్పండి, మా అమ్మానాన్న ఎక్కడ అని నందు లాస్యని నిలదీస్తాడు.


తులసి అనసూయకి మాటలతో సర్ది చెప్పేదానికి చూస్తుంది.


తులసి: మావయ్య విషయంలో మీరు చేసింది అందరికీ తప్పే. మావయ్య తన జీవితంలో ఎప్పుడు లేనంతగా బాధపడటానికి కారణం, బాద్యత మీరే. అందరి ముందు ఆయన పరువు తీశారు, పాతాళానికి తోసేశారు. తలుచుకుంటేనే సిగ్గేసేలా మాటలు అన్నారు. ఏ భార్య భర్త పట్ల ప్రవర్తించని విధంగా మీరు చేశారు. చేతులెత్తి మొక్కాల్సిన మనిషి గుండెని ముక్కలు ముక్కలు చేశారు. ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని లాభం ఏముంది? ఆయన మనసు మార్చలేవు. ఈ కన్నీళ్ళు మీ గుండె బరువు తగ్గిస్తాయేమో


అనసూయ: ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఏం చేసి తప్పు సరిదిద్దుకోవాలి


Also Read: మాళవిక జైలుకి వెళ్ళి చిప్పకూడు తినాల్సిందేనన్న అభిమన్యు- కోర్టుకి చేరిన వేద, యష్


తులసి: మీరు చేసింది తప్పు కాదు పాపం, తప్పు అయితే సరిదిద్దుకోవచ్చు, కానీ పాపం చేశారు శిక్ష అనుభవించాల్సిందే. మొట్టమొదటి సారి మావయ్య గట్టిగా అరవడం విన్నాను అది కోపంతో అరవడం కాదు గుండెకి గాయం వల్ల వచ్చిన అరుపులు అవి.. కొద్దిగా సమయం ఇవ్వండి ఆయన కోపం తగ్గిపోయి చల్లారిపోతారు


అనసూయ: నావల్ల పెద్ద తప్పు జరిగిపోయింది.. అది నిజంగానే పెద్ద పాపం.. నాభర్తని కష్టపెట్టాను, ఆయన ఇంట్లో నుంచి ఆయన్నే తరిమేశాను దూరం చేశాను అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆయన ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి వెళ్ళిపోవడం తట్టుకోలేకపోయాను. సామ్రాట్ ఎప్పుడు నా కళ్ళ ముందు కనిపించినా చెప్పలేనంత కోపం వచ్చేది ఆపుకోలేకపోయాను. మీ ఇద్దరి మధ్య ఉంది కేవలం స్నేహం అనే తెలుసు అయినా కూడా నా మనసుకి నచ్చజెప్పుకోలేకపోయాను ఎందుకో కూడా నాకు తెలియదు గత 26 ఏళ్లుగా నువ్వు నాకు అలవాటు అయిపోయావు, హక్కు ఉండేది, ఆహక్కు ఎలా వదులుకునేది. నా సంతోషాన్ని నేనే కాల్చేసుకున్నా, ఆయన లేకుండా నేను ఉండలేను చచ్చిపోతాను. ఇన్నాళ్లలో ఆయన కోపం చూశాను కానీ ద్వేషం చూడలేదు అది నేను తట్టుకోలేను.. నీకు చేతులెత్తి మొక్కుతాను ఆయన్ని ఇంటికి తిరిగి తీసుకురా, ఆయన్ని తిరిగి తీసుకొచ్చేది నువ్వు మాత్రమే, నాకు నా భర్త కావాలి ఆయనే నాకు లోకం.. నన్ను క్షమించమ్మా, నా భర్తని నాకు తెచ్చివ్వమ్మా అని ఏడుస్తుంది.


నందు కోపంగా అడిగేసరికి లాస్య జరిగింది మొత్తం చెప్పేస్తుంది. అసలు ఎలా వెళ్లనిచ్చావ్ ఏం చేస్తున్నావ్ అని అరుస్తాడు. అభి చెప్పబోతుంటే నోర్ముయ్ అని అంటాడు. తాతయ్యని నేను చూసుకుంటాను బాధ్యత నాది అని మాట ఇచ్చావ్ ఏం చేశావ్ ఇదేనా మాట నిలబెట్టుకునేది అని నందు ఉగ్రరూపం దాలుస్తాడు. తులసి అనసూయని ఇంటికి తీసుకొస్తుంటే రోడ్డు మీద అమ్మలక్కలు నోటికొచ్చినట్టు వాగుతారు. కానీ వాటిని పట్టించుకోవద్దని తులసి అంటుంది. ‘మా నాన్న మా ఇంటి దేవుడు, ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, ఎక్కడ మా నాన్న’ అని లాస్యని గట్టిగా అడుగుతాడు. అప్పుడే తులసి అనసూయని ఇంటికి తీసుకుని వస్తుంది. మా నాన్నని ఇంటికి తీసుకొచ్చేవరకి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అని శపథం చేస్తాడు.


Also Read: పిల్లలతో సహా సౌందర్య ఆందరావుని కలిసిన దీప-కార్తీక్, గన్ కి పనిచెప్పిన మోనిత, ఇక శుభం కార్డేనా!


తరువాయి భాగంలో..


తులసి అనసూయని తీసుకుని ఇంట్లోకి వస్తుంటే అది చూసి నందు రగిలిపోతాడు. తల్లిని ఇంట్లోకి అడుగుపెట్టనివ్వడు. నాన్నని ఇంటికి తిరిగి తీసుకొచ్చే వరకి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని తల్లికి తెగేసి చెప్తాడు.