కాసేపు అత్తయ్య కళ్ళలోకి చూస్తే తన మనసులో ఏముందో తెలిసిపోతుందని దివ్య చెప్తుంది. తన కళ్ళలోకి చూసి కన్న కూతురు లాంటి దివ్య పక్కన కూర్చుంటే ఎంత బాగుందా అనుకుంటున్నారని దివ్య చెప్పేసరికి బసవయ్య నిజమా అంటాడు. ఒకసారి తన అమ్మ వాళ్ళింటికి వెళ్ళి రావాలని అడుగుతుంది. అదేంటి మూడు రాత్రులు జరగకుండా ఇల్లు దాటి వెళ్లకూడదని ప్రసన్న అంటుంది. అది జరగదు కదా మా అత్తయ్య జరగనివ్వదు కదా? పంతులు ముహూర్తం లేనప్పుడు అత్తయ్య ఫస్ట్ నైట్ జరగనివ్వరు కదా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్తుంది. ఈ ముహూర్తాల గోల నీకు అర్థం కాదులే వెళ్ళమని అంటుంది. మీరు ముహూర్తాలు పెట్టేవరకు నేను దూరంగా ఉంటాను కానీ విక్రమ్ దూరంగా ఉండలేకపోతున్నాడు, కొత్త చీర కట్టుకుంటే వెనుకే కుక్కపిల్లలా తిరుగుతున్నాడని  సిగ్గుపడుతూ చెప్తుంది. విక్రమ్ ని ఆపే బాధ్యత మీదే ఆయన చెయ్యి నా చేతిలోకి వచ్చాక మీరు ఏమి చేయలేరని, తల్లి అల్లం, పెళ్ళాం బెల్లం అంట అనేసి కాసేపు రాజ్యలక్ష్మిని వణికిస్తుంది. ఏదో తేడాగా ఉంది దివ్య కళ్ళలోకి చూడొద్దని బసవయ్య భయపడతాడు.


కేసు కోర్టు దాకా వెళ్తుందని రేపే ఆర్గ్యుమెంట్ అని మోహన్ నందుకి చెప్తాడు. లాస్య చేసిన తప్పులన్నీ కోర్టులో బయట పెట్టమని అనసూయ అంటుంది. కానీ అది అంత ఈజీ కాదని చెప్తాడు. నందు లాస్యని కొట్టలేదని మన దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు, అవతలి వైపు లాయర్ మిమ్మల్ని రెచ్చగొట్టి లాస్యని తిట్టేలా మాట్లాడితే మాత్రం కేసు గురించి ఇక మర్చిపోవడమేనని మోహన్ అంటాడు. కోర్టులో ఎలా నడుచుకోవాలో అందరికీ జాగ్రత్తలు చెప్తాడు. తులసి కోర్టుకి రావడం లేదని చెప్తుంది. నువ్వు రాకపోతే ఎలా నువ్వు పక్కన ఉంటే మాకు ధైర్యంగా ఉంటుందని అనసూయ రమ్మని పిలుస్తుంది. తను కోర్టుకి వస్తే సమస్య దారి తప్పుతుందని అందరూ ఇంకోలా ఆలోచిస్తారని తులసి అంటుంది. మోహన్ రమ్మని అడిగినా కూడా తులసి రానని తెగేసి చెప్తుంది.


Also Read: ఉత్కంఠ నడుమ పూర్తయిన రిషిధార నిశ్చితార్థం- అంతుచిక్కని శైలేంద్ర ప్లాన్


లాస్య లాయర్ దగ్గరకి వస్తుంది. మీ భర్త మిమ్మల్ని కొట్టినట్టు సాక్ష్యం కావాలని అడుగుతాడు. అప్పుడే ఒకామే వచ్చి మీ ఇంట్లో పనిమనిషినని వస్తుంది. నందుతో కలిసి కన్సల్టెన్సీ పెట్టినప్పుడు మంగమ్మ తమ దగ్గర పని చేసిందని లాస్య ఆమెని పరిచయం చేసింది. తనకి డబ్బులు ఆశ చూపి నందు గురించి వ్యతిరేకంగా చెప్పిస్తుంది. ఈ సాక్ష్యం చాలు నందు దోషని తేల్చేయడానికని లాయర్ అంటాడు. సంజయ్ ఎవరో వ్యక్తితో గొడవపడటం చూసి విక్రమ్ వాడి అంతు తెలుస్తానని చెప్తాడు. అప్పుడే దివ్య వచ్చి మనకి రేపు వేరే పని ఉందని చెప్పేసరికి అవును అతనితో సాయంత్రం మాట్లాడతానని అంటాడు. పెళ్ళాం తర్వాత తమ్ముడని మరోసారి విక్రమ్ రుజువు చేశాడని బసవయ్య ఎక్కిస్తాడు. తులసికి లాస్య మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఎందుకు కాల్ చేసి నన్ను విసిగిస్తున్నావని తులసి అడుగుతుంది.


Also Read: ఇరువురి భామల నడుమ నలిగిపోతున్న మురారీ- ఉంగరం ఎక్కడదని అడిగిన రేవతి


నువ్వు మీ ఆయనకి దూరం అవాలని అనుకుంటున్నావా దగ్గర కావాలని అనుకుంటున్నావా? అంటుంది తులసి. నా వల్ల తప్పు జరిగింది ఇంకెప్పుడు తులసి వైపు చూడనని బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వమను అప్పుడు కేసు వెనక్కి తీసుకుంటానని లాస్య ఆఫర్ ఇస్తుంది. మీ ఆయన తప్పు చేశాడని అంటావే కానీ నీ తప్పు గురించి ఆలోచించవా అని గడ్డి పెడుతుంది. సరే అయితే దివ్య జీవితం నాశనం చేసేందుకు రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు తీసుకున్నా తప్పు అయిపోయిందని బాండ్ పేపర్ మీద రాసివ్వమని సలహా ఇస్తుంది.