తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా నిర్మించాలని పెద్ద కుమార్తె సుస్మిత చాలా ఏళ్లుగా అనుకుంటున్నారు. అలాగే, చిరంజీవితో సినిమా చేయడమే తన లక్ష్యం, ధ్యేయం అని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ చాలా ఏళ్లుగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరుగా అనుకున్నా... ఆఖరికి కలసి చేద్దామని ఫిక్స్‌ అయ్యారు. అయితే... ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఇంకా తేలడం లేదు. 'ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని అన్నారు కదా' అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారా? మీరు అనుకున్నది నిజమే. కానీ, అక్కడ పరిస్థితి అలా లేదని టాక్. 


కుమార్తెతో సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకో?
సినిమా సెట్స్‌ మీద ఉండగానే తర్వాతి సినిమాను ఓకే చేసేసి పట్టాలెక్కించడానికి అన్నీ ప్లాన్‌ చేసుకునే రకం చిరంజీవి. ఆయన స్టార్‌ హీరో అయినప్పటి నుండి ఇదే స్టైల్‌ కొనసాగిస్తున్నారు కూడా. కరోనా తర్వాత అయితే ఏకంగా నాలుగు సినిమాలు లైనప్‌లో పెట్టారు. దీంతో 'విశ్వంభర' సినిమా తర్వాత ఏంటి అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఆ సినిమా షూటింగ్‌ చివరి దశకు వచ్చేసింది కాబట్టి కొత్త సినిమా త్వరలోనే అనౌన్స్‌ చేస్తారని కూడా అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయం తేలడం లేదు. 


చిరంజీవి 157వ సినిమా కోసం బీవీఎస్‌ రవి ఓ కథ సిద్ధం చేశారని చాలా నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అది నిజమే కూడా! ఇదిగో, అదిగో అంటూ ఆ సినిమా గురించి అక్కడా, ఇక్కడా మాటలు వినిపిస్తున్నాయి. ఆయన అందించిన కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి సినిమా చేయడానికి చిరంజీవి చాలా మంది దర్శకులకు ఛాన్స్‌ ఇచ్చారని కూడా విన్నాం. ఆఖరిగా 'గాడ్‌ ఫాదర్‌' దర్శకుడు మోహన్‌ రాజా కోర్టులో బంతి ఉందని తేలింది. కానీ ఇప్పుడు అక్కడి నుండి వేరే దగ్గరకు కథ వెళ్తోంది అంటున్నారు. 


కొన్ని రోజులుగా ఈ సినిమా మీద పని చేసిన మోహన్‌ రాజా టీమ్‌ ఇప్పుడు చేయడం లేదట. దానికి కారణం స్క్రిప్ట్‌ విషయంలో చిరంజీవి సంతృప్తి చెందకపోవడమే అని అంటున్నారు. దీంతో ఆ కథ ఇప్పుడు వేరే దర్శకుడి దగ్గరకు వెళ్తుంది అని చెబుతున్నారు. అసలు ఆ కథ ఏ జోనర్‌ అనేది ఇప్పటివరకు ఎక్కడా లీకు రాలేదు. అయితే మోహన్‌ రాజా వరకు వెళ్లింది కాబట్టి యాక్షన్‌ థ్రిల్లర్‌ అయి ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఓకే అవ్వలేదు.


Also Readమీరు ఏమైనా అనుకోండి... నాకు ఇష్టమైతే, నా మనసుకు నచ్చితే వెళ్తా... వైసీపీ క్యాండిడేట్‌కు సపోర్ట్ - నంద్యాల ఎపిసోడ్‌ మీద పవన్, నాగబాబుకు బన్నీ కౌంటర్?



ఈ నేపథ్యంలో ఈ రోజు వస్తుంది అనుకున్న ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఇంకా రాలేదు అని చెబుతున్నారు. దర్శకుడు తేలకుండా అనౌన్స్మెంట్‌ ఇస్తే బాగుండదు అని టీమ్‌ అనుకుంటోందట. ప్రస్తుతం ఓ ముగ్గురు దర్శకుల పేర్లు చిరంజీవి మనసులో ఉన్నాయని... వారిలో ఒకరికి సినిమా కథ అప్పగిస్తారని చెబుతున్నారు. ఆ ముగ్గురూ యువ దర్శకులే అని చెబుతున్నారు. ఈ విషయంలో ఒకట్రెండు రోజులలో క్లారిటీ రావొచ్చు అంటున్నారు. కుమార్తె నిర్మాణంలో చేయబోయే సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు? అంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని  చిరంజీవి అనుకోవడమే కారణం అట! తొందర పడి పట్టాలు ఎక్కించకుండా జాగ్రత్త పడుతున్నారట.


Also Read: త్రిశూలంతో చిరంజీవుడు... మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ 'విశ్వంభర' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్