అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారి. తరచూ నటనకు సంబంధించిన విషయాలు లేదంటే అందం గురించి ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. వయసు పెరిగినా వన్నె తరగని అందం ఆమెది అభిమానులు అంటుంటారు. అటువంటి శ్వేతా తివారి, ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలకు టార్గెట్ అయ్యారు. భగవంతుడి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...


'షో స్టాపర్' వెబ్ సిరీస్ టీమ్ బుధవారం భోపాల్ వెళ్లింది. సౌరభ్ రాజ్ జైన్, రోహిత్ రాయ్ తదితరులతో పాటు ఆ వెబ్ సిరీస్‌లో శ్వేతా తివారి కూడా నటించారు. ఆమె కూడా భోపాల్ వెళ్లారు. అక్కడ విలేకరుల సమావేశంలో "భగవంతుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు" అని శ్వేతా తివారి అన్నారు. ఆ మాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేవుడిని అలా అనడం ఏమిటని కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యాఖ్యలు కాస్త మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి వెళ్లాయి. దాంతో ఆయన విచారణకు ఆదేశించారు.


నరోత్తమ్ మిశ్రా వద్ద శ్వేతా తివారి వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా... "నేను విన్నాను. చూశాను కూడా. నిజానిజాలు ఏమిటో తెలుసుకుని 24 గంటల్లో రిపోర్ట్ స‌బ్‌మిట్‌ చేయమని భోపాల్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాను" అని ఆయన తెలిపారు. శ్వేతా తివారిపై పరువు నష్టం దావా, కేసులు వేయడాని పలువురు సిద్ధం అవుతున్నట్టు బాలీవుడ్ సమాచారం. వీడియో సాక్ష్యాలు ఉండటంతో ఈ వివాదం నుంచి ఆమె బయట పడటం కష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారు. శ్వేతా తివారి వ్యాఖ్యలు తమ మనోభావాలను కించపరిచాయని హిందుత్వవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.