రొటీన్ చిత్రాలతో పోల్చితే హారర్, కామెడీ చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి.  తెలుగు సినిమా పరిశ్రమలో పలు హారర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించిన సందర్భాలున్నాయి. అప్పట్లో ‘మంత్ర’ మొదలు కొని 'కాంచన',  'ప్రేమ కథాచిత్రమ్' వరకు మంచి హిట్ అందుకున్నాయి. అదే తరహాలు తెరకెక్కిన చిత్రం 'గీతాంజలి'.

   అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. ఎంవివి సత్యనారాయణ నిర్మించారు.  కోనా వెంకట్ ఈ సినిమాకు కథ అందించారు. అంతేకాదు, ఈ సినిమాను ఆయనే సమర్పించారు.  


10 ఏండ్ల తర్వాత ‘గీతాంజ‌లి’ సీక్వెల్


2014లో వ‌చ్చిన ‘గీతాంజ‌లి’ అద్భుత విజయాన్ని అందుకుంది. హార‌ర్ సినిమాలు మంచి ఆదరణ పొందుతున్న సందర్భంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను చక్కగా ఆకట్టుకుంది.ఈ సినిమా  హీరోయిన్ అంజ‌లికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతోనే నటుడు శ్రీ‌నివాస‌రెడ్డి హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు. దర్శకుడిగా ఈ చిత్రంలో చక్కటి నటన కనబర్చారు. బ్రహ్మానందం, ‘సత్యం’ రాజేష్, షకలక శంకర్ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమా విడుదలైన దాదాపు 10 ఏళ్ల త‌ర‌వాత ‘గీతాంజ‌లి’కి సీక్వెల్ వ‌స్తోంది.


`గీతాంజ‌లి మ‌ళ్ళీ వ‌చ్చింది` షూటింగ్ షురూ


`గీతాంజ‌లి మ‌ళ్ళీ వ‌చ్చింది` పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ `గీతాంజ‌లి` సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు మేక‌ర్స్. దర్శకుడు కోన వెంక‌ట్‌ ఈ చిత్రానికి క‌థ అందించ‌డంతో పాటు నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తన స‌న్నిహితుడు  శివ తుర్ల‌పాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పోస్టు ప్రొడక్షన్, స్క్రిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలో షూటింగ్ మొదలయ్యింది. `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి రామ‌చంద్ర క్లాప్‌ కొట్టారు. సినిమా స్క్రిప్ట్‌ ని ఎంవీవీ స‌త్యనారాయ‌ణ‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా డైర‌క్ట‌ర్ శివ తుర్ల‌పాటికి అంద‌జేశారు.


ఆకట్టుకుంటున్న లేటెస్ట్ పోస్టర్


ఈ చిత్రంలో అంజలి హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీనివాసరెడ్డి హీరోగా కనిపించనున్నారు. స‌త్యం రాజేష్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ర‌వి శంక‌ర్ (డ‌బ్బింగ్ ఆర్టిస్ట్), రాహుల్ మాధ‌వ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కోనా వెంకట్ ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ పాడుబ‌డ్డ బంగ్లా ప్రాంగ‌ణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయితో పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తి క‌లిగిస్తూ, ఆక‌ట్టుకుంటోంది.  ఈ చిత్రానికి ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సుజాత సిద్ధార్థ్, ఎడిట‌ర్‌ గా చోటా కె ప్ర‌సాద్‌, ఆర్ట్ డైరెక్టర్ గా నార్ని శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా  నాగు వై బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 






Read Also: ముంబై వీధుల్లో హిందీ హీరోతో కీర్తి సురేష్ ఆటో రైడ్ - బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial