ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా నందమూరి కుటుంబంలో విబేధాలు మరోసారి బయట పడ్డాయని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించమని బాలకృష్ణ ఇచ్చిన ఆదేశాలపై ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే... అసలు ఏం జరిగింది? బాలకృష్ణ అలా ఎందుకు చెప్పారు? దాని వెనుక కారణాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 


విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి నేడు. ప్రతి ఏడాది జనవరి 18న (వర్ధంతి నాడు) నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సైతం ఆ సంప్రదాయం కొనసాగింది. ఎన్టీఆర్ తనయుడు, అగ్ర హీరో బాలకృష్ణ వెళ్లిన సమయానికి ఘాట్ ప్రవేశానికి రెండు వైపులా ఫ్లెక్సీలు ఉన్నాయి.


ఇంతకు ముందు ఫ్లెక్సీలు లేవు...
ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చాయి?
ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఇంతకు ముందు ఫ్లెక్సీలు కట్టే సంప్రదాయం లేదని, ఈ ఏడాది అది ప్రారంభమైందని నందమూరి ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ''ఫ్లెక్సీలు రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ ఏర్పాటు చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. అలా కాకుండా ఎన్టీఆర్ ఘాట్ ప్రవేశ ద్వారానికి అట్టహాసంగా ఫ్లెక్సీలు కట్టడం బాలకృష్ణ ఆగ్రహానికి కారణమైంది'' అని గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 


గతంలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అటు ఇటుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ...  ఘాట్ ప్రవేశ ద్వారానికి ఎప్పుడూ ఫ్లెక్సీలు కట్టలేదని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు చేసిన పని కారణంగా వాటిని తొలగించమని బాలకృష్ణ ఆదేశించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం.


Also Read: ఫిల్మ్ నగర్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలి - వర్ధంతి సభలో ఎమ్మెల్యే మాగంటి డిమాండ్






తొలగించిన ఫ్లెక్సీలను మళ్లీ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్
బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణం అక్కడ నుంచి తొలగించారు. తర్వాత ఆ వీడియోలు న్యూస్, వెబ్ ఛానళ్లలో వైరల్ అయ్యాయి. బాలకృష్ణ ''తీసేయ్... ఇప్పుడే'' అని చెప్పిన మాటలు కూడా బయటకు వచ్చాయి. అయితే... ఆ తీసేసిన ఫ్లెక్సీలను యంగ్ టైగర్ ఫ్యాన్స్ మళ్లీ ఏర్పాటు చేశారు. ఎక్కడ నుంచి అయితే బాలకృష్ణ తీయమని చెప్పారో... మళ్లీ అక్కడ ఏర్పాటు చేశారు.






ఎన్టీఆర్ స్పందిస్తారా? లేదా?
ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు బాలకృష్ణ వెళ్లడానికి ముందు... ఈ రోజు ఉదయం హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తాతయ్యకు నివాళులు అర్పించి వచ్చారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ బయటకు రాలేదు. ఫ్లెక్సీల ఘటన మీద స్పందించలేదు. ఈ వివాదం ఎన్టీఆర్ & కళ్యాణ్ రామ్ సోదరులకు తెలుసో? లేదో? ఒకసారి ఫ్లెక్సీలు తీసేసిన తర్వాత అభిమానులు అత్యుత్సాహంతో మళ్లీ అక్కడ ఏర్పాటు చేయడం మీద నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also Readమెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ - రిపబ్లిక్ డేకి అనౌన్స్?