మలయాళ సినిమా పరిశ్రమలో ‘దృశ్యం’ కాంబో మళ్లీ మళ్లీ రిపీట్ అవుతోంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాప్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కలిసి వరుస సినిమాలు చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘దృశ్యం’, ‘దృశ్యం2’ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇతర భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. మరోవైపు ‘దృశ్యం3’పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.


‘దృశ్యం’ కాంబోలో మరో మూవీ


మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబోలో కొద్ది రోజుల క్రితం ‘ రామ్ పార్ట్ 1’ అనే సినిమాను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఒక సినిమా కొనసాగుతుండగానే, మరో సినిమాను ప్రకటించడం మలయాళీ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా సరికొత్త కథాంశంతో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. మూవీ షూటింగ్ ఆగష్టు నుంచి  మొదలుకానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.


మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబోకు మంచి క్రేజ్


వాస్తవానికి ‘దృశ్యం’ కాంబోకు మలయాళీ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరు కలిసి తీసిన సినిమాలన్నీ అద్భుత విజయాలను అందుకుంటున్నాయి. ‘దృశ్యం’,  ‘దృశ్యం 2’ తర్వాత ‘12Th Man’ అనే సినిమా కూడా వీరిద్దరి కాంబోలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా మంచి ఆదరణపొందింది. ఈ నేపథ్యంలోనే ‘రామ్ పార్ట్ 1’ సెట్స్ మీద ఉండగానే మరో సినిమా అనౌన్స్  చేశారు. ఈ కొత్త చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు.


ప్రతిష్టాత్మక 'వృషభ' సినిమాలో నటిస్తున్న మోహన్ లాల్


అటు మోహన్ లాల్, జీతూ జోసెఫ్ సినిమాలు కాకుండా 'వృషభ' అనే మరో సినిమా చేస్తున్నారు.   నంద కిషోర్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం  భారీ బడ్జెట్ తో రూపొందుతున్నది. ఈ చిత్రానికి ఏక్తా కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  సుమారు రూ. 200 కోట్లతో AVS స్టూడియోస్, కనెక్ట్ మీడియా సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.  ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడతో పాటు హిందీ భాషలోనూ రూపొందబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2024లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.


‘వృషభ’ స్టోరీ ఏంటంటే?


‘వృషభ’ మూవీ తండ్రీ, కొడుకల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని తరాల గురించి చెప్పబడే ఒక భావోద్వేగ కథను చిత్రంగా మలువబోతున్నారు. AVS స్టూడియోస్ నుంచి రాబోయే ఈ బహుభాషా చిత్రంలో మోహన్‌లాల్ తండ్రి పాత్రను పోషించబోతున్నారు.  ఈ చిత్రం రెండు భావోద్వేగాల నడుమ కొనసాగబోతుందని మేకర్స్ వెల్లడించారు. ప్రేమ, ప్రతీకారం మధ్య జరిగే పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నట్లు తెలిపారు.


Read Also: ‘ఆహా’లోకి విశ్వక్ సేన్ ఎంట్రీ- ఎంటర్ టైనింగ్ షోతో దుమ్మురేపనున్న ఊరమాస్ హీరో!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial