దర్శకధీరుడు, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాను సైతం కాదని గుజరాత్‌కు చెందిన ‘ఛెల్లో షో’ భారతదేశం తరఫున ఆస్కార్ నామినేషన్లకు పంపడంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ స్పందించారు.


‘ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా జ్యూరీ గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'ని ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ చేసిందని విన్న తర్వాత 'ఛెల్లో షో' టీజర్ చూశాను. అలాంటి కంటెంట్ చిత్రాలు సౌత్ లో చాలా వచ్చాయి. నేను కూడా ఇండియన్ ఆస్కార్ నామినేట్ కమిటీకి జ్యూరీ సభ్యునిగా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి వైస్ చైర్మన్ గా, గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ కమిటీకి జ్యూరీ మెంబర్ గా పని చేశాను.’


‘ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో జ్యూరీ మెంబర్ గా, ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మెన్ గా పని చేసిన అనుభవంతో ఆర్ఆర్ఆర్ సినిమాని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆర్ఆర్ఆర్ లో దేశ భక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు, ఇండియన్ సినిమా ప్రతిష్టను కాపాడటానికి చిత్ర బృందం చేసిన కృషి మనందరికీ తెలిసిందే. గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'ని ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియదు కానీ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పంపకపోవడం బాధ కలిగించింది.’ అని తన ప్రకటనలో పేర్కొన్నారు.