మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' అనే సినిమాను రూపొందించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 

అలానే దర్శకుడు బాబీ, మెహర్ రమేష్, రామజోగయ్య శాస్త్రి, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇలా చాలా మంది గెస్ట్ లుగా వచ్చారు. ముందుగా సినిమాలో ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివలను స్టేజ్ పైకి పిలిచి.. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగింది సుమ. ఈ సంభాషణ మొత్తం చాలా ఫన్నీగా సాగింది. 

 

అనంతరం దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ''చిరంజీవి గారి సినిమా టికెట్స్ కోసం చొక్కాలు చించుకున్నాం. ఆయన షూటింగ్ చూస్తే చాలనుకున్న నాకు ఆయన్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. 'ఆచార్య' నాకొక అద్భుతమైన ప్రయాణం. మెగాస్టార్ అంటే గొప్ప నటుడని అందరికీ తెలుసు. కానీ 'ఆచార్య' జర్నీలో ఆయనొక గొప్ప మనిషని తెలుసుకున్నా.. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా కోసం నాలుగేళ్ల సమయం పట్టింది. దీనికోసం నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారు. తిరు మంచి అవుట్ పుట్ ఇచ్చారు. మణిశర్మ ప్రాణం పెట్టి పని చేశారు. టెక్నికల్ టీమ్ అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. రామ్ చరణ్ గారికి కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్'' అంటూ చెప్పుకొచ్చారు.