Udayagiri Mla : ఏదైనా కొత్త భవనం కానీ, రూమ్ కానీ, షాపు కానీ ప్రారంభించేటప్పుడు రిబ్బన్ కటింగ్ చేయడం ఆనవాయితీ. కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం సోఫాలకు, కుర్చీలకు కూడా రిబ్బన్లు కట్టి కట్ చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీరిగ్గా నాలుక కరుచుకున్నారు. టీడీపీ కూడా సోషల్ మీడియాలో ఈ ఫొటోలను విస్తృతంగా ప్రచారం చేసింది. వైసీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో మీరే చూడండి అంటూ సెటైర్లు వేశారు. ఉదయగిరిలో వైసీపీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, కార్యాలయంలోని కుర్చీలు, సోఫాలను కూడా ప్రారంభించారు. చంద్రశేఖర్ రెడ్డి భార్య, ఉదయగిరి వైసీపీ ప్రచార కార్యదర్శి ఎస్.శాంతకుమారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కటింగ్ లు మాత్రం ఈ కార్యక్రమానికి హైలెట్ గా మారాయి.  














గతంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రహరీ గోడ ప్రారంభోత్సవం చేశారని వచ్చిన వార్తలు వచ్చాయి. అప్పట్లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్టీ నేత‌లు అత్యుత్సాహంతోనో, ప్రచార హడావుడితో నేతలు చేస్తున్న కొన్ని ప‌నులు వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. ముఖ్యంగా చిన్నా చిత‌కా ప‌నుల‌కు ప్రారంభోత్సవాలు చేసి న‌వ్వుల పాలవుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ప్రహ‌రీ గోడ‌ ప్రారంభోత్సవాల్లో పాల్గొన‌డం గతంలో వైరల్ అయింది. ఉండ‌వ‌ల్లి శ్రీదేవి స‌హా కొంద‌రు నేత‌లు ఇలాంటి కార్యక్రమాల‌కు చేసిన హ‌డావుడి అప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఒక గేదెకు ప్రారంభోత్సవం చేయ‌డానికి ఎమ్మెల్యే హాజ‌రు కావ‌డం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గంలో ఎమ్మెల్యే ఉషా శ్రీ చ‌ర‌ణ్ గేదె వద్ద రిబ్బన్ కట్ చేశారు. గేదె చుట్టూ క‌ట్టెల‌తో బారికేడ్ల మాదిరి క‌ట్టి వైసీపీ జెండాలోని నీలి రంగుతో ఉన్న రిబ్బన్ క‌ట్టి దాన్ని ఎమ్మెల్యే క‌ట్ చేశారు. ఈ ఫొటో అప్పట్లో తెగ వైరల్ అయింది.