హీరోయిన్లుగా రాణించాలంటే అందంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. ఒకప్పుడు హీరోయిన్లు బొద్దుగా, కాస్త రంగు ఉన్నా రాణించేవారు కానీ ఇప్పుడు రోజులు మారాయి. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలంటూ కొన్ని రూల్స్ వచ్చేశాయి. సరైన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. తెల్లగా అందంగా కనిపిస్తే అవకాశాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. చాలా కొద్దిమంది మాత్రమే యావరేజ్ కలర్ తో హీరోయిన్లుగా రాణించారు. 


కెరీర్ ఆరంభంలో ఓ మోస్తరు రంగులో ఉన్నప్పటికీ.. ఆ తరువాత స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ తమ రంగుని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పూజాహెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ ను ఈ విషయంలో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈమెతో పోలిస్తే నటి డింపుల్ హయతి రంగు చాలా తక్కువ. తెలుగులో రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. 


తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న 'వీరమే వాగై సూడుం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను 'సామాన్యుడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తనకు సినిమా అవకాశాలు బాగానే వస్తున్నప్పటికీ.. కెరీర్ ఆరంభంలో మాత్రం రంగు సమస్య వెంటాడేదని చెప్పుకొచ్చింది. 


తను కొంచెం తక్కువ రంగు ఉండడంతో.. ఎన్నిసార్లు రిజెక్షన్స్ ఎదురయ్యాయో లెక్కలేదని తెలిపింది. ఎన్నో సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని.. తన ముందు నేరుగా అనకపోయినా.. వెళ్లిపోయిన తరువాత.. అమ్మాయి నల్లగా ఉందని, ఫెయిర్ స్కిన్ ఉండాలంటూ కామెంట్స్ చేసేవారు. ఆ విషయం తెలిసి చాలా బాధపడేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది డింపుల్ హయతి.  


ప్రస్తుతం పరిశ్రమల్లో తెలుగమ్మాయిలకు సానుకూల స్పందన ఉందని.. ఎన్నో అవమానాలు దాటుకొని ఇక్కడవరకు వచ్చానని.. ఒకప్పుడు రంగు, అందానికి ప్రాధాన్యం ఇచ్చేవారని.. ఇప్పుడు టాలెంట్ ఉంటేనే అవకాశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది.