కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎన్నో టాలెంట్స్ ఉన్న వ్యక్తి. నటుడిగా, నిర్మాతగా, పాటల రచయతగా, గాయకుడిగా ఎన్నో రంగాల్లో తన పట్టు నిరూపించుకున్నాడు. అంతే కాకుండా గతంలో ‘పవర్ పాండి’ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఆ తర్వాత తెలుగు హీరో నాగార్జున కీలక పాత్రలో ఒక సినిమా ప్రారంభించినా, అది మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి ధనుష్ మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధం అయ్యాడు. తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును ‘D50’ అని పిలుస్తున్నారు. అయితే ‘రాయన్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు సమాచారం.


సన్‌పిక్చర్స్ నిర్మాణంలో...
సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టర్ ద్వారా ప్రకటించారు. ధనుష్ ఈ సినిమాలో గుండుతో కనిపించనున్నారు. ధనుష్ లుక్‌కు సంబంధించి చిన్న టీజ్ కూడా చేశారు. షర్ట్ లేకుండా గుండుతో, చేతిలో కత్తితో ఉన్న ధనుష్‌ను వెనుక నుంచి చూపించారు.










సందీప్ కిషన్ కూడా...
ఈ సినిమా స్టార్ కాస్ట్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ధనుష్‌కు ఎస్‌జే సూర్య అన్నయ్యగా, సందీప్ కిషన్ తమ్ముడిగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. సందీప్ కిషన్‌కు జోడిగా ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి నటించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఉత్తర చెన్నై నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామానే ఈ ‘రాయన్’ అని తెలుస్తోంది.


సందీప్ కిషన్, ధనుష్ ఇప్పటికే ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇద్దరి పోర్షన్లు పూర్తయ్యాయి. ధనుష్ పూర్తిగా ‘కెప్టెన్ మిల్లర్’ లుక్ నుంచి బయటకు వచ్చేయగా, సందీప్ కిషన్ షూటింగ్ పార్ట్ కూడా పూర్తయిందని ‘కెప్టెన్ మిల్లర్’ డైరెక్టర్ అరుణ్ మతీశ్వరన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.


వరుస సినిమాలతో...
‘కెప్టెన్ మిల్లర్’ 2023 చివర్లోనూ, ‘D50 (రాయన్)’ 2024 ప్రారంభంలోనూ విడుదల కానున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమాను కూడా ధనుష్ ఇటీవలే ప్రకటించాడు. 2024లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. 2024 ప్రారంభంలో ఆ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది.


ధనుష్ ఇప్పటికే ‘సార్’ ద్వారా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ధనుష్ రెండు సినిమాలు చేయాల్సి ఉంది. వీటిలో ఒకటి 2018లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వడచెన్నై’కి సీక్వెల్. అలాగే ధనుష్ తన అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘యుగానికి ఒక్కడు 2’ని కూడా ప్రకటించారు. ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియరాలేదు. ప్రస్తుతానికి ధనుష్ చేతి నిండా సినిమాలతో ఇండియాలోనే బిజీగా ఉన్న హీరోల్లో ఒకరిగా ఉన్నారు.