కింగ్ అక్కినేని నాగార్జున న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి కళ్యాణ్ కృష్ణ కురసాల వరకు ఎందరో కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. అయితే ఇప్పుడు మరో డెబ్యూ డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారట. నాగ్ తన నెక్స్ట్ మూవీని ఓ కొత్త దర్శకుడి చేతిలో పెడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 


'బంగార్రాజు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగార్జున.. గతేడాది 'బ్రహ్మాస్త్ర' చిత్రంతో ఆకట్టుకున్నాడు. కానీ ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'ది ఘోస్ట్' మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఇప్పుడు కింగ్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్త వహిస్తూ, ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో 'పొరింజు మరియం జోస్‌' అనే మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి నాగ్ ఆసక్తి కనబరిచారు. ఈ సినిమాతో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఉగాదికి అధికారిక ప్రకటన ఉందని కూడా అన్నారు. కానీ ఇంతవరకు అది జరగలేదు.  


అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, నాగార్జున 'పొరింజు మరియం జోస్' రీమేక్ ప్రాజెక్ట్ కు సైన్ చేసారు. ఇది నాగ్ 99వ చిత్రం. శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. దీనికి ప్రసన్న కుమార్ ను రైటర్ గానే తీసుకున్నారట. కథ - స్క్రీన్ ప్లే - మాటల కోసం వర్క్ చేస్తారట. దర్శకత్వ బాధ్యతలను మాత్రం మరొకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్లిందని అంటున్నారు. 


Also Read: ఒక్కచోట చేరిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ - 'అష్ట దర్శకుల' ఫ్రేమ్ అదిరిందిగా!


ఇటీవలి కాలంలో పలు సూపర్ హిట్ తెలుగు చిత్రాలకు పనిచేసిన విజయ్ బిన్నీ.. కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలని కథలు రెడీ చేసుకుంటున్న విజయ్.. నాగార్జునను మీట్ అయ్యారట. అతని వర్క్ కు కన్విన్స్ అయిన నాగ్.. తన సినిమాతో డైరెక్టర్ గా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం విజయ్ బిన్నీ ఫైనల్ స్క్రిప్ట్ మీద పని చేస్తున్నాడని, త్వరలోనే మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. 


నాగార్జున నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి తన ఏజ్ హీరోలు వరుస హిట్లు కొడుతున్న తరుణంలో.. నాగ్ కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఎవరైనా పేరున్న దర్శకుడితో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. కానీ కింగ్ మాత్రం డెబ్యూ డైరెక్టర్ తో చేయనున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. గతంలో డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసారు. ఇప్పుడు విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేయనున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.  


ఇకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. సునీల్ నారంగ్ నిర్మాణంలో ధనుష్ హీరోగా తెరకెక్కే పాన్ ఇండియా మూవీలో నాగ్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఏదేమైనా రాబోయే బర్త్ డే సందర్భంగా ఆగస్టు 29న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ నుంచి నాగార్జున హోస్టింగ్ లో 'బిగ్ బాస్ తెలుగు' కొత్త సీజన్ ప్రారంభం కానుంది. 


Also Read: 'సూర్య S/O కృష్ణన్‌'కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ - సూర్య గత చిత్రాల కంటే ఎక్కువగా!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial