మహి వి రాఘవ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో వైయస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి అద్భుతంగా నటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల కావడం జగన్ కి, వైసీపీ పార్టీకి ఇది కాస్త బాగా ఉపయోగపడిందనే వాదన కూడా చాలా మందిలో ఉంది. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో మరోసారి దర్శకుడు మహి రాఘవ యాత్ర సీక్వెల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు 'యాత్ర 2' సినిమాని ఇటీవల అనౌన్స్ చేసి విడుదల తేదీని కూడా ప్రకటించారు.


ఇక 'యాత్ర 2'లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఏపీ రాజకీయాల్లో వైయస్ జగన్ ఎదిగిన విధానాన్ని హైలెట్ చేయబోతున్నట్లు  తెలుస్తోంది. అలాగే అప్పట్లో జగన్ చేసిన పాదయాత్రను కూడా ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ గా చూపించబోతున్నారట. ఈ క్రమంలోనే తాజాగా 'యాత్ర 2' నుంచి మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ మోషన్ పోస్టర్ వీడియోలో డైలాగులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ముందుగా ఈ మోషన్ పోస్టర్ వీడియో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వాయిస్ తో మొదలవుతుంది." నమస్తే బాబు, నమస్తే చెల్లెమ్మా, నమస్తే అంటూ వైఎస్సార్ వాయిస్ తో భారీ చేతి స్టాచ్యుని చూపిస్తారు. ఇక ఆ స్టాచ్యూ పైకి జగన్ వెళతారు. నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేను విన్నాను, నేనున్నాను" అంటూ జగన్ పాత్రధారి చెప్పే డైలాగ్స్ అమాంతం ఆకట్టుకున్నాయి.


దాంతో ప్రస్తుతం 'యాత్ర 2' మోషన్ పోస్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా 'యాత్ర 2' మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. 'తాను విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు. రాజకీయం కోసం ఈ సినిమా చేస్తున్నారా?, ఎన్నికలకు ముందే ఎందుకు ఈ సినిమా వస్తోంది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పను అని అన్నారు. కాగా 2009 నుండి 2019 వరకు వైయస్ జగన్ రాజకీయ ప్రయాణం పైనే 'యాత్ర 2' మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మహీవి రాఘవ. జగన్ పాత్రలో నటించే నటుడు ఎవరో ఇంకా ఫైనల్ అవ్వలేదని, త్వరలోనే ఆ నటుడిని ప్రకటిస్తామని' ఈ సందర్భంగా దర్శకుడు తెలియజేశారు.


Also Read : తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టే కొడుకు వైఎస్ జగన్ - అదే 'యాత్ర 2'


ఇక 'యాత్ర2'లో వైయస్ జగన్ పాత్రని తమిళ హీరో జీవా పోషిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు రావడం జరిగింది. మరి మూవీ యూనిట్ జగన్ పాత్రలో జీవా ని తీసుకుంటారా? లేక మరో నటుడిని ఎంపిక చేస్తారా? అనేది చూడాలి. జగన్ పాత్రతో పాటు ఇతర నటీ, నటుల వివరాలను కూడా చిత్ర బృందం ఇంకా ప్రకటించాల్సి ఉంది. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ సినిమాని శివ మేక నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2024 ఫిబ్రవరి నెలలో విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.


 



Also Read : 'సలార్' ట్రైలర్ కి టైమ్ ఫిక్స్ - రాబోయే అప్డేట్స్ పై మేకర్స్ సాలిడ్ అనౌన్స్ మెంట్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial