కాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో నాలుగో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గురు పౌర్ణమి సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డైనమిక్ కాంబోలో మరో మూవీ రానున్నట్లు అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నారు? బన్నీ ఎలా కనిపిస్తాడు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


త్రివిక్రమ్ ఈ సినిమాని ‘మహాభారతం’ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మహాభారతంలోని రెండు పర్వాలను బేస్ చేసుకుని దర్శకుడు కథను సిద్ధం చేశారని, ఇది సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందే భారీ సినిమా అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారతంలోని ఐకానిక్ పాత్రలో బన్నీ కనిపిస్తారని, ఇంతకముందెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో స్టైలిష్ స్టార్ ని ప్రెజెంట్ చేయనున్నారని అంటున్నారు. 


పురాణాలు ఇతిహాసాలను సినిమాలలో భాగం చేయడం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కొత్తేమి కాదు. ఆయన తీసిన ప్రతీ చిత్రంలోనూ ఏదో సందర్భంలో రామాయణం, మహాభారతాలకు సంబంధించిన డైలాగులు వినిపిస్తుంటాయి. పాత్రల పేర్లు కూడా వాటి నుంచి స్ఫూర్తి పొందినవి వుంటాయి. కాకపొతే ఈసారి మాత్రం దర్శకుడు ఏకంగా మహాభారతాన్నే కథా వస్తువుగా తీసుకుని సినిమా చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. దీని కోసం ఒక ఏడాది కాలంగా వర్క్ చేస్తున్నారట.


అనౌన్స్మెంట్ వీడియోని బట్టి బన్నీ & త్రివిక్రమ్ కలయికలో ఓ భారీ సోషియో ఫాంటసీ మూవీ రాబోతోందని అర్థమవుతోంది. త్రివిక్రమ్ ఇలాంటి జోనర్ లో సినిమా చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు ఇది ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్ గతంలో 'బద్రీనాథ్' సినిమాతో ఫాంటసీ ప్రయోగం చేసి, బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాడు. కానీ ఇక్కడ త్రివిక్రమ్ కు పురాణాలు ఇతిహాసాల మీద మంచి పట్టు ఉండటం, అందులోనూ మహాభారతం స్పూర్తిగా రాసుకున్న కథ అని టాక్ నడుస్తుండటంతో అందరిలో అంచనాలు రేకెత్తిస్తోంది.


Also Read: వెంకటేష్‌తో స్వామి వివేకానంద వెబ్ సిరీస్ ప్లాన్ చేశాం, కానీ.. : దర్శకుడు నీలకంఠ


ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు మంచి కమర్షియల్ విజయాలు సాధించాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాఫీస్ హిట్లుగా నిలిస్తే.. 'అల వైకుంఠపురములో' సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కాంబో రిపీట్ అవ్వడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడంపై అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నామని’ పేర్కొన్నారు. 


పద్మశ్రీ అల్లు రామలింగయ్య & మమత సమర్పణలో గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. సంగీత దర్శకుడిగా ఎస్ థమన్ ను తీసుకున్నట్లు టాక్. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పూర్తవ్వగానే బన్నీ మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial