Manushi Chhillar: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఏరియల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాతో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇది తనకు కచ్ఛితంగా హిట్ అందిస్తోందని నమ్మకంగా ఉంది.


2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న హర్యానా బ్యూటీ మానుషి చిల్లర్... 'సామ్రాట్ పృథ్వీరాజ్' అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రాణి సంయోగిత పాత్ర‌లో నటించింది మానుషి. 2022లో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో డైరక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.


డెబ్యూతో భారీ ఫ్లాప్ అందుకున్న తర్వాత, 'ది గ్రేట్ ఇండియా ఫ్యామిలీ' అనే మూవీ చేసిందీ ప్రపంచ సుందరి. విక్కీ కౌశల్ హీరోగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందించిన ఈ కామెడీ డ్రామా కూడా ఘోర పరాజయం చవిచూసింది. ఇలా బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ అందుకున్న మానుషి... ఇప్పుడు 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అయింది. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.


'ఆపరేషన్ వాలెంటైన్'లో వరుణ్ తేజ్ ప్రేయసిగా నటిస్తున్న మానుషి... రాడార్ ఆఫీసర్ గా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అమ్మడు తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ మీడియా సోషల్ మీడియాల దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ సినిమా హిట్టయితే మిస్ వరల్డ్ కి తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారైనా సక్సెస్ రుచి చూస్తుందో లేదనేది మరో వారంలో తెలిసిపోతుంది.






ఇకపోతే మానుషి చిల్లర్ ప్రస్తుతం 'బడే మియాన్ చోటే మియాన్' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఈద్ స్పెషల్ గా 2024 ఏప్రిల్ 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత 'టెహ్రాన్' అనే యాక్షన్ థ్రిల్లర్ లో జాన్ అబ్రహాంతో కలిసి నటించబోతోంది మానుషి. 


భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే అనేక మంది మిస్ వరల్డ్స్, మిస్ ఇండియాలు, మిస్ ఇంటర్నేషనల్ లు హీరోయిన్లుగా తమ ఉనికిని చాటుకున్నారు. అందం అభినయంతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కూడా రాబోయే రోజుల్లో మంచి విజయాలు అందుకొని, స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.


Also Read: వివాదంలో ‘అమరన్’ - శివకార్తికేయన్ సినిమాని నిషేధించాలంటూ నిరసనలు!