టాలీవుడ్ యంగ్ హీరోల్లో మాస్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో విశ్వక్ ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే కదా. తన మూవీ అప్డేట్స్ తో పాటు అప్పుడప్పుడు ఈ హీరో చేసే పోస్టులు వివాదాలకు దారి తీస్తూ ఉంటాయి. విశ్వక్ ఏ విషయాన్ని అయినా భయపడకుండా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఉన్నది ఉన్నట్టు పంచుకుంటాడు. ఇండస్ట్రీలో తనపై ఎలాంటి నెగెటివిటీ వచ్చినా దాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విశ్వక్ సేన్ తన ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.


డీటెయిల్స్ లోకి వెళ్తే. రీసెంట్ గా 'ధమ్కీ' సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో తెగ బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs Of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఇటీవల మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.


అయితే తాజాగా రిలీజ్ డేట్ విషయమై ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ విశ్వక్ సేన్ ట్విట్టర్ లో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. "బ్యాక్గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పనిచేసే చెబుతున్నా. డిసెంబర్ 8 వస్తున్నాం. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ప్లాప్ మీ డెసిషన్. ఆవేశానికి లేదా ఇగో కి తీసుకునే డెసిషన్ కాదు. తగ్గే కొద్దీ మింగుతామని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తి పోద్ది. గంగమ్మ తల్లి కి నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్ కాకపోతే నన్ను #GOG ప్రమోషన్స్ లో చూడరు" అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.




విశ్వక్ చేసిన పోస్ట్ ని బట్టి చూస్తే రిలీజ్ డేట్ విషయంలోనే ఇబ్బందులు తలెత్తినట్టు స్పష్టం అవుతుంది. అయితే విశ్వక్ ఎవరిని ఉద్దేశించి  చేశారన్నది మాత్రం తెలియట్లేదు. విశ్వక్ షేర్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్స్ మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ సినిమా హిట్ అవుతుందని అంటుంటే.. మరికొందరు మళ్ళీ పబ్లిసిటీ ప్రమోషనల్ స్టంట్స్ ఏంటి? అని కౌంటర్స్ వేస్తున్నారు. ఇంకొంతమంది ఈ కాంట్రవర్సరీలు నీకు అవసరమా? అని సలహాలు సైతం ఇస్తున్నారు. దీంతో ఆ పోస్ట్ డిలేట్ చేశాడు హీరో.


తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 8న కాకుండా డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీకర ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి చిత్రంలో మనోహరి సాంగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి మళ్లీ చాలా కాలం తర్వాత ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ‘సింహం సిక్ అయితే పందికొక్కులు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాయంట’ - యాక్షన్, కామెడీ మిక్స్‌గా కార్తీ ‘జపాన్’ ట్రైలర్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial