బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. రోజు రోజుకు ఓటీటీల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆమె కూడా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే తొలి సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'జానే జాన్' పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది.  క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సిరీస్ కు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ లో, విజయ్ వర్మ,  జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలను పోషించారు.


ఆమెతో శృంగార సీన్లలో నటించాలంటే భయం వేసేది- విజయ్


తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా నటుడు విజయ్ వర్మ కరీనా కపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఓ అద్భుత నటిగా అభివర్ణించారు. ఆమె మంచి మనసు కలిగిన వ్యక్తి అన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు తాము కరీనా సినిమాలు చూసి ఎలా ఎంజాయ్ చేసేదో చెప్పుకొచ్చారు. “మేము ఆమె సినిమాలు చూస్తూ  విజిల్స్ కొట్టే వాళ్లం. ఆమెను అభిమాన హీరోయిన్ గా భావించేవాళ్లం. ఇప్పుడు ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది” అన్నారు.  ఇక రొమాంటిక్ సన్నివేశాల్లో తనతో కలిసి నటించడం చాలా భయం కలిగించిందన్నారు. ఆమెతో కలిసి శృంగార సన్నివేశాలు చేసే సమయంలో తన శరీరంలో వణుకు పుట్టేదన్నారు. “ఆమె అద్భుతంగా నటించగలదు. ఆమె ఎంత అందంగా ఉంటుందో, అంతకు మించి ప్రశాంతంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.


‘జానే జాన్’ కథ ఏంటంటే?


ఒంటరి జీవితాన్ని గడిపే ఒక స్త్రీ,  ఒక పోలీస్ ఆఫీసర్,  ఒక టీచర్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. మాయ డిసౌజా అనే మహిళ, కొన్ని కారణాలతో భర్తను చంపేస్తుంది. ఆ హత్య గురించి బయటకు తెలియకుండా దాచిపెట్టడానికి ఆమె చాలా ప్రయత్నిస్తుంది. ఇంతకీ ఆమె ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? లేదా? అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సిరీస్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది.  కరీనా మాయా డిసౌజా పాత్రలో కనిపించగా,  జైదీప్ పోలీసు అధికారిగా, విజయ్ వర్మ కరీనా నైబర్ గా నటిస్తున్నారు. ఇందులో తన కూతురుని కాపాడుకునేందుకు కరీనా పడే తపనను అద్భుతంగా చూపించారు.  


కరీనా పుట్టిన రోజునే ‘జానే జాన్’ స్ట్రీమింగ్


సెప్టెంబర్ 21న కరీనా కపూర్ తన 43వ పుట్టిన రోజును జరుపుకోబోతోంది. అదే రోజు ఈ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ జపనీస్ రచయిత కీగో హిగాషినో 2005లో రాసిన నవల ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ ఆధారంగా రూపొందించబడింది. జానీ జాన్ క్రాస్ పిక్చర్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్‌ తో కలిసి 12వ స్ట్రీట్ ఎంటర్‌టైమెంట్,  నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించబడింది.  కరీనా చివరిగా ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేదు.


Read Also: హైదరాబాద్ ప్రజల నెత్తుటి కథ ‘రజాకార్’ - టీజర్ చూశారా


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial