నిజాం నిరంకుశ పాలన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.  బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే సహా పలువురు ఈ చిత్రంలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వేడుకలో నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి, ద‌ర్శ‌కుడు యాటా స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్యే రాజా సింగ్‌, హీరోయిన్ అనుష్య త్రిపాఠి సహా పలువురు నటీనటులు పాల్గొన్నారు.


ఇది మ‌త చ‌రిత్ర కాదు, గ‌త చ‌రిత్ర‌- ద‌ర్శ‌కుడు యాటా స‌త్య‌నారాయ‌ణ


“భారతదేశానికి ఆగ‌స్టు 15న స్వాతంత్య్రం వ‌చ్చింది. తెలంగాణ, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల ప్రజలకు ఎప్పువచ్చిందటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ ప్రాంతాలు స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాయి. ఎంద‌రో ప్రాణ త్యాగం చేశారు.   రక్తంతో త‌డిసిన చ‌రిత్ర మ‌ట్టిలో క‌లిసిపోయింది. చ‌రిత్ర‌ను తొక్కేశారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌కు స్వాతంత్ర్యం వ‌చ్చిన సెప్టెంబ‌ర్ 17 క‌థా వ‌స్తువుగా మారింది. ఆ రోజు జ‌రిగిన విముక్తి పోరాటం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించాను. ఇది మ‌త పోరాటం కాదు.. స్వాతంత్య్ర పోరాటం. దీన్ని మ‌తం దృష్టితో కాకుండా పోరాటం దృష్టితో చూడాలి. ఇది మ‌త చ‌రిత్ర కాదు,గ‌త చ‌రిత్ర‌ అని గుర్తుంచుకోవాలి’’ అన్నారు దర్శకుడు నారాయణ


‘రజాకార్’ సినిమాతో నిజాం నిరంకుశత్వాన్ని చూపిస్తున్నారు- రాజాసింగ్


‘‘నేటి యువతకు గత చరిత్రను తెలియజేయడానికి ఈ సినిమా తీశారు. మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది? అనేది ఈ మూవీ చెప్పబోతోంది. ‘కాశ్మీర్ ఫైల్స్‌’, ‘కేరళ ఫైల్స్‌’ చిత్రాలను ఆపేందుకు చాలా మంది ప్రయత్నించారు. కాశ్మీర్, కేరళలో జరుగుతున్న విషయాలను ప్రజలు ఈ సినిమాల ద్వారా తెలుసుకున్నారు. ‘రజాకార్’ సినిమా ద్వారా నాడు ఏం జరిగిందో చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాను తీసే ధైర్యం దర్శకుడు చేసినందుకు అభినందనలు” అని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.    


ఈ సినిమాలో న‌టించ‌టం గ‌ర్వంగా ఉంది- అనుష్య త్రిపాఠి  


‘‘ఏడాదిన్న‌ర క్రితం ‘రజాకార్’ సినిమా జర్నీ మొదలయ్యింది.  ఇలాంటి గొప్ప సినిమాలో న‌టించ‌టం గ‌ర్వంగా ఉంది. మ‌నం చ‌రిత్ర నుంచి చాలా విష‌యాల‌ను నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ సినిమా ఎన్నో చారిత్రాత్మక విషయాలను ప్రజల ముందు ఉంచబోతోంది” అని హీరోయిన్ అనుష్య త్రిపాఠి వెల్లడించింది. 


కప్పి పెట్టిన చరిత్రను విప్పి చూపిస్తున్నాం- నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి


‘‘ఇది అసలు చరిత్ర. ఓట్ల కోసం శ‌వాల‌పై పేలాల‌ను ఏరుకునే వ్య‌క్తులు చ‌రిత్ర‌ను క‌ప్పి పెట్టారు. మేం ఆ చరిత్రను విప్పి చూపించబోతున్నాం.  ఆనాడు మ‌న స‌మాజంలో జ‌రిగిన విష‌యాలు గురించి ఈనాటి యువ తరానికి తెలియాలనే ఈ సినిమా చేశాం. ఇక్క‌డి వారికి చాలా మందికి స్వాతంత్ర్యం ఎప్పుడు వ‌చ్చిందో తెలియ‌దు. అలాంటి వారంద‌రికీ ఈ సినిమా అసలు నిజాలను చెప్పబోతోంది” అని నిర్మాత గూడురు నారాయణరెడ్డి తెలిపారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలకానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.



Read Also: డిలీటెడ్ సీన్లతో ‘జవాన్’ ఓటీటీ విడుదల, అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన దర్శకుడు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial