Vijay Deverakonda: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మార్ఫింగ్‌ వీడియో అంశం గత మూడు రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. డీప్ ఫేక్ వీడియోల విషయంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య వరకూ పలువురు సెలబ్రిటీలు రష్మీక కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. తాజాగా ఈ ఇష్యూపై యువ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ అడ్వైజరీని కూడా జారీ చేసింది. ఈ వార్తను విజయ్ దేవరకొండ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. భవిష్యత్తు కోసం తప్పకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎవరికీ ఇలాంటివి జరగకూడదని, అలాంటి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


"భవిష్యత్తు కోసం ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరికీ ఇలా జరగకూడదు. ఇలాంటి వాటిని అణిచివేయడానికి, తక్షణ చర్యలు తీసుకునేందుకు, వెంటనే శిక్షించడానికి ఓ సమర్థవంతమైన సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు మరింత సురక్షితంగా ఉంటారు." అని విజయ్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. డీప్ ఫేక్ వీడియో ఇష్యూలో VD తన కోస్టార్ రష్మికాకు మద్దతుగా నిలుస్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


Also Read:  'ఆరేళ్ళ ప్రాయంలోనే రాష్ట్రపతి అవార్డ్.. విశ్వనటుడి సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలు!


కాగా, బ్రిటిష్-ఇండియన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ జరా పటేల్ ముఖాన్ని రష్మిక మందన్న పేస్ తో మార్ఫింగ్ చేసిన డీప్ ఫేక్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం 24 గంటల్లో ఆ వీడియోని తొలగించాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌లను ఆదేశించింది. అలానే ఇలాంటి మార్ఫింగ్ వీడియోలకు సంబంధించిన నిబంధనలను గుర్తు చేస్తూ ఓ అడ్వయిజరీని జారీ చేసింది. డీప్‌ ఫేక్‌ వీడియోలు క్రియేషన్‌, సర్క్యులేషన్‌కు సంబంధించిన పెనాల్టీలు, నిబంధనలు గుర్తు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ సోషల్‌ మీడియా సంస్థలకు అడ్వయిజరీని పంపించింది. 


ఇక సినిమాల విషయానికొస్తే, 'గీత గోవిందం' 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం తెలిసిందే. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేసిన ఈ జంట ఆఫ్ స్క్రీన్ లోనూ కలిసి కనిపిస్తుండటంతో, వీరి సంబంధంపై అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇద్దరూ పలు సందర్భాల్లో తమపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. తాము మంచి స్నేహితులమని, తమ మధ్య మంచి బాండింగ్ ఉందని పేర్కొన్నారు. 


Also Read: అరుంధతిగా భయపెట్టి, భాగమతిగా బాక్సాఫీస్​ను షేక్ చేసిన మిస్ స్వీటీ శెట్టి!