ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖుల జీవితాల గురించి ఆయన చెప్పిన విషయాలపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలో ఓ విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...


పై లోకాలకు వెళ్లిన వేణు స్వామి మాతృమూర్తి
వేణు స్వామికి జన్మనిచ్చిన తల్లి, శ్రీమతి పరాంకుశం విజయ లక్ష్మి గారు ఈ రోజు... అనగా అక్టోబర్ 4, శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు.‌ ''మా అమ్మ గారు శ్రీమతి పరాంకుశం విజయ లక్ష్మి గారు ఈరోజు ఉదయం పరమపదించారు (మరణించారు)'' అని సోషల్ మీడియా వేదికగా వేణు స్వామి వెల్లడించారు. తన తల్లి ఫోటోని ఆయన షేర్ చేశారు.


Also Read'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?



వేణు స్వామి జ్యోతిష్యం మీద విమర్శలు
అక్కినేని నాగ చైతన్య, సమంత వైవాహిక జీవితంలో కలతలు ఉన్నాయని, ఆ ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండరని, అతి త్వరలో విడిపోతారని మీడియా ముఖంగా తొలుత చెప్పింది ఆయనే. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత తాను చెప్పింది అక్షర సత్యమైందని పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.


నాగచైతన్య, సమంత విడాకుల గురించి మాత్రమే కాదు... రెబల్ స్టార్ ప్రభాస్ జాతకంలో ఇక విజయాలు లేవని సైతం ఆయన చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరిగిన కొన్ని రోజులకు వాళ్ళిద్దరూ కూడా విడిపోతారని జోస్యం చెప్పారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్), ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికార పగ్గాలు చేపడతారని కూడా తెలిపారు. వేణు స్వామి చెప్పిన జోస్యాల్లో కొన్ని నిజం కాలేదు. 


'సలార్', 'కల్కి 2898 ఏడి' సినిమాలతో ప్రభాస్ విజయాలు అందుకుంటే... రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన వేర్వేరు ఎన్నికలలో ముఖ్యమంత్రుల తమ పదవి కోల్పోయారు. ఏపీలో అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇటువంటి అంశాల కారణంగా వేణు స్వామి మీద తీవ్రమైన విమర్శలు రావడంతో ఇకపై తాను జాతకం చెప్పనని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.


Also Read: శ్రీ విష్ణు 'స్వాగ్'ఓటీటీ పార్ట్నర్ ఏది? ఆ సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?


అక్కినేని నాగచైతన్యతో శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండరని తెలిపారు. శుభమా అని నిశ్చితార్థం చేసుకుంటే పెళ్లి కాకముందే పెటాకులు అవుతుందని చెప్పడం ఏమిటని సామాన్యుల సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వేణు స్వామి తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని, గతంలో నాగచైతన్య - సమంత వైవాహిక జీవితానికి సంబంధించి చెప్పిన జోస్యానికి కొనసాగింపుగా శోభితతో జరిగిన నిశ్చితార్థం గురించి చెప్పానని చెప్పుకొచ్చారు. వేణు స్వామి ఒక పబ్బుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో నాగచైతన్య, సమంత మధ్య జరిగిన గొడవల గురించి మాట్లాడితే ఆయన తానేదో శాస్త్రం ప్రకారం తెలుసుకున్నట్లు మీడియా ముందు కలరింగ్ ఇచ్చారనే విమర్శల సైతం ఉన్నాయి.