Venkatesh about Guntur Kaaram: వెంకటేశ్ హీరోగా నటించిన 75వ చిత్రమే ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. తన కూతురిని కాపాడుకోవడం కోసం రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను సంపాదించడానికి హీరో వెళ్తాడని, అదే సమయంలో తనకు ఒక ఫ్లాష్‌బ్యాక్ ఉందని బయటపడుతందని ట్రైలర్‌లో క్లియర్‌గా చూపించాడు దర్శకుడు. ఇక సంక్రాంతి బరిలో ఇతర సినిమాలతో పోటీపడడానికి ‘సైంధవ్’ సిద్ధమయ్యింది. మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ జనవరి 12న విడుదల అవుతుండగా.. ఒక్కరోజు గ్యాప్‌లో ‘సైంధవ్’ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో థియేటర్లు లేకపోవడంపై వెంకటేశ్ స్పందించారు.


చెప్పే పరిస్థితిలో లేను..
‘‘నేనేమీ ఫీల్ అవ్వను. మాకు వచ్చినవి తీసుకుంటాను. ఎక్కడ రిలీజ్ అవుతుందో చూస్తాం. హ్యాపీగా అందరూ బాగుండాలి’’ అంటూ ‘గుంటూరు కారం’ కంటే ‘సైంధవ్’కు తక్కువ థియేటర్లు దొరకడంపై పాజిటివ్‌గా స్పందించారు వెంకటేశ్. అంతే కాకుండా ‘సలార్’, ‘డంకీ’ ఒకేరోజు గ్యాప్‌లో విడుదల అవ్వడం వల్ల కలెక్షన్స్‌పై ఎంతోకొంత ప్రభావం పడిందని, ఇప్పుడు ‘గుంటూరు కారం’, ‘సైంధవ్’కు కూడా అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దానిపై కూడా వెంకటేశ్ రియాక్ట్ అయ్యారు. ‘‘నేను ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోను. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది కరెక్టా కాదా అని సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా నేను లేను’’ అంటూ ఇతర సినిమాలతో పోటీపై స్పందించడానికి ఇష్టపడలేదు వెంకటేశ్.


చాలా దురదృష్టకరం..
‘‘ఇలా జరగడం చాలా దురదృష్టకరం. కానీ కొన్నిసార్లు ఆడియన్స్ చాలా తెలివిగా ఆలోచిస్తారు. వాళ్లకి నచ్చిన సినిమాలు మాత్రమే చూస్తారు. వాళ్లు అన్ని సినిమాలకు స్పేస్ ఇస్తారని అనుకుంటున్నాను. మనం అలా పాజిటివ్‌గానే ఆలోచించాలి. దాని వల్ల ఏ సినిమాపై ప్రభావం పడిందని పండగ సమయంలో చూద్దాం. కొన్నిసార్లు అన్ని సినిమాలు మంచిగా ఉంటే అన్ని వెళ్లి చూస్తారు’’ అని పాజిటివ్‌గా ఆలోచించమన్నారు వెంకటేశ్. ఈ సందర్భంగా వెంకటేశ్ హిమాలయాల ప్రయాణం గురించి కూడా తనకు ప్రశ్న ఎదురయ్యింది. వెళ్తాను అంటే హిమాలయాలకు వెళ్లొస్తానని, వెళ్లి అక్కడే సెటిల్ అయిపోతానని కాదు అని వెంకటేశ్ క్లారిటీ ఇచ్చారు. అభిమానుల ప్రేమను వదిలేసి తాను ఎక్కడికి వెళ్లను అని స్పష్టం చేశారు.


మొత్తం ముగ్గురు హీరోయిన్లు..
ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైంధవ్’.. జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో వెంకటేశ్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. విలన్స్‌గా ముఖేష్ రిషీ, నవాజుద్దీన్ సిద్ధికీ, ఆర్య కనిపించనున్నారు. రుహానీ శర్మ, ఆండ్రియాలాంటి హీరోయిన్లు కూడా ‘సైంధవ్’లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలతో కలిసి ‘హిట్‌వర్స్’ అనే థ్రిల్లర్ ప్రపంచాన్ని సృష్టించాడు శైలేష్. ఇక మొదటిసారి తన కెరీర్‌లో ‘సైంధవ్’తో వెంకటేశ్‌లాంటి సీనియర్ హీరోను డైరెక్ట్ చేశాడు. మెడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా విజయంపై మూవీ టీమ్ నమ్మకంతో ఉంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. బేబీ సారా పాలేకర్ పాత్ర చుట్టూనే ‘సైంధవ్’ సినిమా తిరుగుతుంది.


Also Read: 'గుంటూరు కారం' రిలీజ్ - దిల్ రాజు భారీ స్కెచ్?