Venkatesh - Anil Ravipudi: విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఉగాది పండగ సందర్భంగా 'Venky Anil3' 'SVC 58' వంటి వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే రోజున వచ్చే సంక్రాంతి రిలీజ్ అంటూ వీడియో వదిలారు. ఇది దర్శక హీరోల కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ. అందుకే ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం చిత్ర బృందం తాజాగా షూటింగ్ అప్డేట్ అందించింది.


వెంకీ, అనిల్ రావిపూడిల చిత్రాన్ని ఈ బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. "శుభ ముహూర్తాన అద్భుతమైన ప్రయాణానికి నాంది పలకబోతున్నాం. జూలై 3వ తారీఖున 'వెంకీ అనిల్3 x SVC58' సినిమా పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నాం. త్వరలో మీ ముందుకు ఉత్తేజకరమైన అప్‌డేట్‌లు  రానున్నాయి" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. 






అనిల్ రావిపూడి ఈసారి వెంకీ మామతో యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఓ ట్రయాంగిల్ ఎంటర్టైనర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథతో ఈ సినిమా రాబోతోంది. లేటెస్ట్ పోస్టర్ లో తాళి, గన్, గులాబీ పువ్వులను ఉంచడం ద్వారా మేకర్స్ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. లవ్ స్టొరీ, మ్యారేజ్ తో పాటుగా యాక్షన్ కూడా కావాల్సినంత ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా మీనాక్షి చౌదరీని ఎంపిక చేశారు. మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ను ఫైనలైజ్ చేసినట్లు దర్శకుడు ధృవీకరించారు. వీరిద్దరూ సీనియర్ హీరో వెంకటేశ్ తో జోడీ కట్టడం ఇదే తొలిసారి.


భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి...
ఇందులో వెంకటేష్ ఒక మాజీ  పోలీసాఫీసర్ గా కనిపిస్తే.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించారు. సోమవారం బాపట్ల జిల్లాలోని శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న అనిల్ రావిపూడి.. స్వామి వారి పాదాల వద్ద స్క్రిప్టును  ఉంచి పూజలు చేశారు. అనంతరం అనిల్‌ మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని, నవంబర్ నాటికి షూటింగ్ అంతా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. అంటే నాలుగు నెలల్లోనే ఈ సినిమాని పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


టాలీవుడ్ లో వెంకటేశ్, అనిల్ రావిపూడిలను మోస్ట్ ఎంటర్టైనింగ్ కాబినేషన్ గా చెప్పుకుంటారు. 'ఎఫ్‌ 2', 'ఎఫ్ 3' చిత్రాలతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించి, మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ లో మూడో మూవీ చేయడానికి రెడీ అయ్యారు. కాకపోతే ఈసారి భిన్నమైన సబ్జెక్ట్ తో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా యాక్షన్ ను కూడా మిక్స్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. రేపు సినిమా ప్రారంభించిన తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.


Also Read: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న టాలీవుడ్ - వెనుకబడిపోయిన కోలీవుడ్!