తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజనటులు అక్కినేని నాగేశ్వరావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబ సభ్యులు నేడు (సెప్టెంబర్ 20) అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు కాగా ఆయన చేతుల మీదుగా ఏఎన్ఆర్ పంచలోహ విగ్రహావిష్కరణ జరిగింది. వెంకయ్య నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో నాగార్జున ఎంతో ఎమోషనల్ అవుతూ పూలతో తన తండ్రికి నివాళులు అర్పించారు.


ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వెంకయ్య నాయుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "నాకు నాగేశ్వరావు అంటే చాలా అభిమానం. ఈ విగ్రహం లో జీవ కళ ఉట్టిపడుతోంది. ఆయనే నిజంగా నిలబడ్డారా అనేలా ఉంది. ఏఎన్ఆర్ మహానటుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహామనిషి. నేను, ఆయన అనేక విషయాలు పై మాట్లాడుకునే వాళ్ళం. ఆయన జీవితమంతా నటిస్తూనే ఉన్నారు. ఆఖరి రోజు వరకు నటించిన నటుడు నాకు తెలిసి చిత్ర పరిశ్రమలో మరొకరు లేరు. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం ఆయనకు మనం ఇచ్చే నివాళి. ఆయన భాష, వేషం, వ్యక్తిత్వం వీటిలో కొంతైనా మనం అందిపుచ్చుకోవాలి. వాళ్ల కుటుంబమంతా తెలుగులో మాట్లాడడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాష కనుమరుగవుతేందేమోనని భయం పుడుతోంది. పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలుగు అంటే నాగేశ్వరరావు కు చాలా అభిమానం. భాష పోతే శ్వాస పోతుంది. శ్వాస పోతే అంతా పోతుంది. అందుకే మన భాషను ఎప్పటికీ మర్చిపోకూడదు. అందరూ తెలుగులో మాట్లాడాలి" అని అన్నారు.


"తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు. నాగేశ్వరరావు తన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునేవారు. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగిపోయేవారు. ఆయన ఒక నట విశ్వవిద్యాలయం. తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆయన జీవితాన్ని చదివారు. జీవితంలో ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. దాన్ని ప్రేమించారు. ఆస్వాదించారు. జీవితంలో తాను నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టి చూపించారు. దీన్ని మనం అలవాటు చేసుకుంటే అది ఆయనకు మనం ఇచ్చే నివాళి. ఆయన ఎప్పుడూ పోరాడి ఓడిపోలేదు. ఆత్మవిశ్వాసం, జీవిత విలువలు తెలుసుకున్నారు. నేటి యువత కూడా వీటిని తెలుసుకోవాలి’’ అన్నారు.


‘‘ఆయన్ని నటుడుగా ఆరాధించడమే కాదు ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సింది చాలా ఉందని నా అభిప్రాయం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నారు. సాంఘిక చిత్రాల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయన ప్రతి సినిమాలో ఓ సందేశం ఉండేది. ఈ మధ్య సినిమాల్లో వాడుతున్న భాష ఏమాత్రం బాగుండడం లేదు. డబుల్ మీనింగ్ వచ్చేలా పదాలు వాడుతున్నారు. రాజకీయం కన్నా సినిమా ప్రభావం ప్రజలపై ఎక్కువ ఉంటుంది. అక్కినేని స్ఫూర్తితో మంచి లక్షణాలను అలవర్చుకొని తర్వాత తరానికి కూడా నేర్పించాలి. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.


Also Read : సుహాస్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్, ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial