'ఎఫ్3' వంటి సూపర్ హిట్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాంఢీవ ధారి అర్జున'. టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కెరీర్లో రొటీన్ సినిమాలే కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేసి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తన మేకవర్ మొత్తాన్ని మార్చుకున్నారు. ఇక ఈసారి యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్ తేజ్. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ లో 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ ని అందుకోవడమే కాకుండా సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ముందుగానే ప్రకటించారు.


కానీ రీసెంట్ గా మూవీ రిలీజ్ విషయంలో అనేక రకాల వార్తలొచ్చాయి. ముఖ్యంగా సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదని, ఆగస్టులో రిలీజ్ అవ్వడం కష్టమే అనే టాక్ వినిపించింది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' సినిమా కూడా ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నందున వరుణ్ తేజ్ వెనక్కి తగినట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది.


'గాంఢీవ ధారి అర్జున' అనుకున్న సమయానికి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు మూవీ యూనిట్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆగస్టు 25న 'గాంఢీవ ధారి అర్జున' ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేయగా తాజాగా విడుదల చేసిన పోస్టర్లో వరుణ్ తేజ్ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగబాబు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


త్వరలోనే మూవీ టీం ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేయనుంది.  కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. 'గని' సినిమాతో కెరియర్ లోనే భారీ ప్లాప్ అందుకున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత 'ఎఫ్2' సీక్వెల్ 'ఎఫ్3' తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. అయితే మల్టీస్టారర్ మూవీ కావడంతో ఇప్పుడు వరుణ్ తేజ్ కి సోలో హిట్ కావాలి. మరి ఆ సోలో హిట్ 'గాంఢీవ ధారి అర్జున' సినిమా ద్వారా వరుణ్ తేజ్ కి దక్కుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమా డైరెక్టర్ విషయానికొస్తే.. సీనియర్ హీరో రాజశేఖర్ తో 'గరుడవేగ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కింగ్ నాగార్జునతో 'ది ఘోస్ట్' అనే సినిమాని తెరకెక్కించాడు. 2022 అక్టోబర్ 5 దసరా కానుకగా భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా మిగిలింది. మరి ఈ  'గాంఢీవ ధారి అర్జున' సినిమా బాక్సఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.