ఇటీవల మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే కదా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1న వివాహ బంధంతో ఒకటయ్యారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఇటలీలోని టస్కానీలో వరుణ్, లావణ్య వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరి పెళ్లికి మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, అతి కొద్ది మంది బంధువులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే.


పెళ్లి తర్వాత తాజాగా హైదరాబాద్ వచ్చిన ఈ జంట ఇక్కడ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ కి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే వరుణ్, లావణ్య పెళ్లికి సంబంధించిన వీడియోను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని, అభిమానుల కోసం మెగా ఫ్యామిలీ పెళ్లి వీడియోను ఓటీటీకి ఇచ్చారని వార్తలు వినిపించాయి. అంతేకాదు వరుణ్, లావణ్య వివాహానికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.8 కోట్లకు దక్కించుకుందని న్యూస్ వచ్చింది. గత రెండు రోజుల నుంచి ఈ న్యూస్ మరింత వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు వరుణ్ తేజ్ టీం దీనిపై స్పందించి అసలు విషయాన్ని వెల్లడించింది.






వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో ఓటీటీ హక్కుల గురించి వస్తున్న పుకార్లన్నీ నిజం కావని, అదంతా ఫేక్ న్యూస్ అని వరుణ్ తేజ్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుణ్ తేజ్ టీం స్పందిస్తూ.." వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఓటీటీ హక్కుల గురించి వస్తున్న పుకార్లు అన్ని అవాస్తవమైనవి. ఇలాంటి పుకార్లను ఎవరు నమ్మవద్దు, వ్యాప్తి చేయవద్దని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం" అని ట్వీట్ చేయడంతో వరుణ్, లావణ్య పెళ్లి ఓటీటీ హక్కుల గురించి వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే బయటికి వచ్చాయి. వీడియోలు ఎక్కువగా రాలేదు.


దీంతో వీరి పెళ్లి వీడియో ఫుటేజ్ ని ఓటీటీకి ఇవ్వబోతున్నారన్న పుకార్లు ఎక్కువైపోయాయి. కానీ తాజాగా వరుణ్ తేజ్ టీం ఆ పుకార్లు నిజం కాదని స్పష్టం చేసింది. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సినీ కెరీర్ విషయానికొస్తే.. రీసెంట్ గా 'గాండీవ దారి అర్జున' అనే సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం 'ఆపరేషన్ వాలెంటైన్' అనే మూవీలో నటిస్తున్నాడు. మానుషి చిల్లర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక లావణ్య త్రిపాఠి ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలేవి చేయడం లేదు. రీసెంట్ టైమ్స్ లో ఈమె లీడ్ రోల్ ప్లే చేసిన 'పులి మేక' వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంది.


Also Read : దంచి కొట్టు, త్రివిక్రమ్ మార్క్ మాస్ సాంగ్ - మహేష్ 'దమ్ మసాలా' వచ్చేసిందోయ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial