Varsha Bollama: ఎన్నో వాయిదాలు, ఇబ్బందులు ఎదుర్కున్న తర్వాత ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఊరు పేరు భైరవకోన’. ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల వరకు తీసుకువెళ్లాలని, వారిలో ఆసక్తి క్రియేట్ చేయాలని మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ విషయంలో చాలా కష్టపడింది. ఇంకా పడుతూనే ఉంది. ఇక ఇందులో హీరోగా నటించిన సందీప్ కిషన్, హీరోయిన్‌ వర్షా బొల్లామా మూవీ ప్రమోషన్స్‌‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్షా.. తన గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తన గురించి ప్రేక్షకులకు తెలియని పలు విషయాలను రివీల్ చేసింది.


కాలేజ్ నుండి ఫ్రెండ్స్..


తాజాగా వర్షా బొల్లామా పాల్గొన్న ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. చివరిసారి అబద్దం ఎప్పుడు ఆడారు అని ప్రశ్నించగా.. బాగా ఆలోచించి వారం క్రితం అని సమాధానమిచ్చింది వర్షా. ఇంట్లో వాళ్లతో చిన్న చిన్న అబద్దాలు అయితే ఎప్పుడూ ఆడుతూనే ఉంటానని, కానీ ఒక ఫ్రెండ్ విషయంలో కాస్త పెద్ద అబద్దం చెప్పి ఒక వారం అవుతుందని బయటపెట్టింది. తనకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారని, వారంతా కాలేజ్ రోజుల నుండే ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. ఇక తనకు సినిమాలు చూసి ఏడ్చే అలవాటు ఉందని, చివరిసారిగా ‘కో గయే హమ్ కహా’ సినిమా చూసి ఏడ్చానని బయటపెట్టింది వర్షా బొల్లామా.


ఆ ఫోబియా ఉంది..


అనన్య పాండే లీడ్ రోల్ చేసిన ‘కో గయే హమ్ కహా’ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యి.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అది తనకు చాలా టచింగ్ అనిపించిందని వర్షా తెలిపింది. తనకు దెయ్యాంటే చాలా భయం అని కూడా రివీల్ చేసింది. అంతే కాకుండా తనకొక ఫోబియా ఉన్న విషయాన్ని కూడా బయటపెట్టింది. ‘‘నాకొక ఫోబియా ఉంది. నేను టాబ్లెట్‌ను మింగలేను. అది ఇప్పటికీ నాకు భయమే. ఇంజెక్షన్ అంటే భయం లేదు. నాకు టాటూ కూడా ఉంది. కానీ టాబ్లెట్ మాత్రం వద్దు’’ అని చెప్పుకొచ్చింది. ఇక తన అతిపెద్ద కోరిక గురించి చెప్తూ.. తనకు వరల్డ్ టూర్‌కు వెళ్లాలని ఉందని మనసులోని మాట బయటపెట్టింది. ప్రపంచం మొత్తం చుట్టేయాలి అన్నదే తన కోరిక అని చెప్పింది.


మహేశ్ బాబుతో నటించిన అమ్మాయి..


తను చివరిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరి గురించి సెర్చ్ చేసింది అని అడగగా.. ‘‘ఒక అమ్యాయి ఈ మధ్య వైరల్ అవుతోంది. మహేశ్ బాబు సినిమాలో నటించింది. ఇప్పుడు హాలీవుడ్‌లో ఉంది. ఇంత వైరల్ అవుతోంది తాను ఎవరా అని మామూలుగా చూశాను’’ అంటూ అవంతిక గురించి సెర్చ్ చేశానని తెలిపింది వర్షా బొల్లామా. ఇక ‘ఊరు పేరు భైరవకోన’ విషయానికొస్తే.. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, వర్షా బొల్లామాతో పాటు కావ్య థాపర్ కూడా లీడ్ రోల్ చేసింది. ఫిబ్రవరీ 16న విడుదలయిన ఈ మూవీ.. ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రివ్యూలు దక్కించుకుంటోంది. చాలా రోజుల తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్‌కు కావాల్సిన హిట్ దక్కిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.


Also Read: బోల్డ్ పాత్రలపై వర్షా బొల్లామా కామెంట్స్ - అలా చేయడానికి చాలా ధైర్యం కావాలి, కానీ..