Dharmendra About Esha Deol Divorce: ఒకప్పుడు హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి ఎక్కువకాలం నిలబడదు అని ప్రేక్షకులు విమర్శించేవారు. కానీ రోజులు మారిపోయాయి. సినీ పరిశ్రమలో జరుగుతున్న విడాకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. కానీ కొన్ని జంటలు మాత్రం తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, తమ స్వార్థం కోసం విడిపోతున్నారని సీనియర్ నటుడు ధర్మేంద్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన కూతురు ఈషా డియోల్ విడాకులపై ధర్మేంద్ర మాట్లాడుతూ.. తన బాధను అంతా బయటపెట్టారు. వారి కూతుళ్ల గురించి అయినా ఆలోచించాల్సింది అంటూ వాపోయారు.


వ్యతిరేకం కాదు..


ఇటీవల తన భర్త భరత్ తఖ్తానీతో విడిపోతున్నట్టుగా ప్రకటించింది ఈషా డియోల్. అయితే ఈషా తండ్రి, సీనియర్ యాక్టర్ ధర్మేంద్ర.. ఈ విషయంపై బాధపడుతున్నారని సమాచారం. మరోసారి వారి విడాకుల గురించి ఆలోచిస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నట్టు బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈషా డియోల్ తీసుకున్న నిర్ణయానికి ధర్మేంద్ర వ్యతిరేకం కాదు. కానీ ఇది వారి కూతుళ్లు రాధ్య, మిరాయాపై ప్రభావం చూపిస్తుందని ఆయన భావిస్తున్నారట. ‘‘ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఫ్యామిలీ ముక్కలవుతుంటే చూడలేరు. ధర్మేంద్ర కూడా ఒక తండ్రే. అందరికీ ఆయన బాధ కూడా అర్థమవుతుంది. ఆయన తన కూతురి నిర్ణయానికి వ్యతిరేకం కాదు. కానీ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు’’ అని ధర్మేంద్ర సన్నిహితులు చెప్తున్నారు.


అల్లుడు కాదు కొడుకే..


‘‘ఈషా, భరత్‌లకు ధర్మేంద్ర అంటే చాలా గౌరవం ఉంది. ఆయన డియోల్ కుటుంబంలో కొడుకు లాంటివాడు. ఈషా అంటే ధర్మేంద్రకు ప్రాణం, ఎప్పుడూ తను సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. ఈషా తీసుకున్న నిర్ణయానికి కుటుంబమంతా బాధపడుతున్నారు కాబట్టి మరోసారి దాని గురించి ఆలోచించమని ధర్మేంద్ర చెప్తున్నారు. వారికి రాధ్య, మిరాయా అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు అటు నాన్నమ్మ కుటుంబానికి, ఇటు అమ్మమ్మ కుటుంబానికి చాలా క్లోజ్. ఈ విడాకుల వల్ల పిల్లలపై తీవ్రమైన ప్రభావం పడుతుందనే ధర్మేంద్ర ఆందోళన పడుతున్నారు’’ అని ధర్మేంద్ర సన్నిహితులు ఆయన మానసిక పరిస్థితి గురించి బయటపెట్టారు.


11 ఏళ్ల తర్వాత..


సీనియర్ నటీనటులు ధర్మేంద్ర, హేమ మాలినిల కుమార్తె ఈషా డియోల్. ఈషా, భరత్ తఖ్తానీలు 2012లో పెళ్లి చేసుకున్నారు. ముందుగా 2017లో వారికి రాధ్య పుట్టింది. 2019లో మిరాయా పుట్టింది. ఇక పెళ్లయ్య 11 ఏళ్లు పూర్తయిన తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2024 ఫిబ్రవరీ మొదట్లో వారి నిర్ణయం గురించి బయటపెట్టింది ఈ జంట. ‘మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా జీవితంలో ఇంత పెద్ద మార్పు జరుగుతున్నా.. దాని వల్ల మా పిల్లల జీవితాలకు మంచి జరగడమే మాకు ముఖ్యం’ అని ఇద్దరు కలిసి ప్రకటించారు. గతేడాదిలో డియోల్ ఫ్యామిలీ బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వగా ఈ ఏడాది మాత్రం ఈషా డియోల్ విడాకుల వార్తతో కుటుంబంతా ఆందోళనలో ఉంది.


Also Read: బోల్డ్ పాత్రలపై వర్షా బొల్లామా కామెంట్స్ - అలా చేయడానికి చాలా ధైర్యం కావాలి, కానీ..