Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 – A.D'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది హిందూ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఇండియన్ ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే లీకుల వ్యవహారం మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. సెట్స్ మీదకు వెళ్లిన దగ్గర నుంచీ ఈ సినిమాకి సంబంధించిన ఏదొక విషయం లీక్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా మరోసారి లీకుల బారిన పడటం అందరినీ షాక్‌కు గురి చేసింది.


కొన్ని రోజుల క్రితం 'కల్కి 2898 AD' సినిమా సీన్స్ లీకై ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ప్రాజెక్ట్-K పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలను అప్పగించిన వీఎఫ్ఎక్స్ కంపెనీ నుంచే ఈ లీకులు జరిగాయని గుర్తించిన టీమ్.. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. గ్రాఫిక్స్ కంపెనీకి లీగల్ నోటీసు ఇవ్వడంతో పాటు, దీనికి కారణమైన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పబ్లిక్ నోటీసు కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఈ లీక్స్ కు బ్రేక్స్ పడలేదు. ఈ సినిమా నుంచి ఈసారి ఏకంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లీక్ అయింది. 
 
లీకైన వీడియోలో ప్రభాస్ వర్గం అత్యాధునిక ఆయుధాలతో శత్రు వర్గం మీద యుద్ధానికి సిద్ధమవుతున్న సన్నివేశాలు కనిపించాయి. ఇందులో ప్రభాస్‌తో పాటుగా దీపిక పదుకునే కూడా కనిపించింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న ఈ యాక్షన్ సీన్స్ ను అభిమానులు సైతం సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇలాంటి సన్నివేశాలు ఇంతకముందెన్నడూ చూడలేదని, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ చాలా గొప్పగా ఉందని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. 






అయితే వెంటనే అప్రమత్తమైన 'కల్కి' టీం.. ఆ వీడియో వైరల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ దానికి సంబంధించిన స్టిల్స్ మాత్రం ఇంటర్నెట్ లో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ప్రాజెక్ట్-K ను అనౌన్స్ చేసినప్పటి నుండి అన్నీ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా, పబ్లిక్ నోటీస్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఏదొక రూపంలో కంటెంట్ లీక్ అవుతూనే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి, ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలని చిత్ర బృందం భావిస్తోంది. 


'కల్కి 2898 AD' సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దిశా పతాని స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. వీరితో పాటుగా మరికొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని 2024 మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటుగా పలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లలో విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు.


Also Read: ‘రాజ‌ధాని ఫైల్స్‌’.. అంతా బాగానే ఉందిగానీ, అదొక్కటే తక్కువ - ప్రేక్షకుడికి టార్చరేనా?