మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన 'రావణాసుర' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. అయితే ఈసారి మాత్రం రవితేజ ఎలాగైనా పాన్ ఇండియా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే 'టైగర్ నాగేశ్వరావు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవితేజ కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. దీంతో సినిమాపై ఆడియన్స్ లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ అంచనాలను రెట్టింపు చేశాయి.


ఇక ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ అంతా ట్రైలర్ కోసం ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ రిలీజ్ ను రవితేజ ఫ్యాన్స్ కే వదిలేసారు మూవీ టీం. ఫ్యాన్స్ ఎప్పుడంటే అప్పుడే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తాజాగా మూవీ టీం ప్రకటించింది. ఈ సినిమాని నిర్మిస్తున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ తన ట్విట్టర్ వేదికగా టైగర్ నాగేశ్వర్ రావు ట్రైలర్ లాంచ్ కోసం రెండు డేట్స్ ని ఫిక్స్ చేస్తూ ఓ పోల్ ని కండక్ట్ చేశారు. ఈ రెండు డేట్స్ లో ఏ డేట్ కి టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ని రిలీజ్ చేయాలో ఫ్యాన్స్ డిసైడ్ చేయాలంటూ నిర్మాత అభిషేక్ కోరగా.. ఎక్కువ మంది ఫ్యాన్స్ మాత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపించారు.


దీంతో ఈ తేదీనే ఫైనల్ చేస్తూ 'టైగర్ నాగేశ్వర్ రావు' ట్రైలర్ సెప్టెంబర్ 27న విడుదల కానుందంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమా ట్రైలర్ రిలీజ్ విషయంలో ఇలా ఫ్యాన్స్ అభిప్రాయాన్ని మూవీ టీం కోరడం, వాళ్ళ నిర్ణయం ప్రకారమే ట్రైలర్ విడుదల చేయడం విశేషం అనే చెప్పాలి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రవితేజ సోదరిగా హేమలత లవణం అనే పాత్రలో కనిపించనున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీత మందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు బాలయ్య 'భగవంత్ కేసరి', తలపతి విజయ్ 'లియో' సినిమాలు దసరా బరిలో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా ఆడియన్స్ లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరి ఈసారి దసరా బరిలో ఏ హీరో బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.


Also Read : హీరోయిన్‌ను అలా చూడటం ఫస్ట్ టైమ్, దీపికాపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial