తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. షారుఖ్ ఖాన్, నయనతార హీరో, హీరోయిన్లుగా ఆయన తెరకెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. షారుఖ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లు వసూళు చేసింది. ఒకే ఒక్క బాలీవుడ్ మూవీతో అట్లీ స్టార్ పాన్ ఇండియన్ దర్శకుల లిస్టులో చేరిపోయారు. ఆయనతో సినిమాలు చేసేందుకు  అగ్ర హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు ఇండస్ట్రీలోకి టాక్ నడుస్తోంది.

  


దీపికను తొలిసారి చూసి షాక్ అయ్యా- అట్లీ     


‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేపథ్యంలో అట్లీ తాజాగా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ‘జవాన్’ మూవీ, హీరో షారుఖ్ ఖాన్ సహా చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘జవాన్’ సెట్స్ లో ఆమెను తొలిసారి చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. “షూటింగ్ తొలి రోజు దీపికా పదుకొణెకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలి అనుకున్నాం. ఆమెను షూటింగ్ స్పాట్ కు రమ్మని చెప్పాం. ఆమె సెట్ లోకి అడుగు పెట్టగానే చూసి ఆశ్చర్యపోయాను. తను ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్ గా వైట్ కలర్ శారీలో వచ్చింది. షూటింగ్ కు వచ్చే సమయంలో చాలా మంది హీరోయిన్లు మేకప్ వేసుకుని వస్తారు. కానీ, ఆమె వితౌట్ మేకప్ రావడం షాకింగ్ గా అనిపించింది. ఇప్పటి వరకు నేను చాలా మంది హీరోయిన్లతో పని చేశాను. ఏ ఒక్కరూ మేకప్ లేకుండా రాలేదు. దీపికా వారందరి కంటే స్పెషల్ అని నిరూపించుకుంది. ఆమె ‘జవాన్’లో నటించడం వల్ల సినిమాకు వెయిటేజీ పెరిగిందని భావిస్తున్నాను. ఆమె ఈ చిత్రంలో నటించినందుకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను” అన్నారు అట్లీ.


‘జవాన్’ ప్రమోషన్స్ లోనూ పాల్గొన్న దీపిక


‘జవాన్’ చిత్రంలో హీరోయిన్ గా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. కానీ, ఆమె ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించిన దీపికా పదుకొణె ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నది. సినిమాపై భారీగా అంచనాలు నెలకొనేలా ప్రయత్నాలు చేసింది. మొత్తంగా ‘జవాన్’ సక్సెస్ లో దీపికా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు.


భారీగా వసూళ్లు సాధించిన ‘జవాన్’


అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించింది.   ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.   


Read Also: 49 లక్షల బడ్జెట్, 2 వేల కోట్ల వసూళ్లు - బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ గురించి మీకు తెలుసా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial