కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌ తన నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయార్చి’ అనే సినిమా చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచీ రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతూనే వుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వచ్చింది. ఈ వార్తలకు బలం చేకూరేలా అజిత్ - సంజూ భాయ్ ల సెల్ఫీ ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.


తాజాగా దుబాయ్‌ లో అజిత్ కుమార్‌, సంజయ్‌ దత్‌ లు ఒక్క చోట చేరి సందడి చేశారు. ఈ సందర్భంగా సంజయ్ సతీమణి మాన్యతా దత్‌ ఇద్దరు స్టార్ యాక్టర్స్ తో కలిసి దిగిన సెల్ఫీ ఫోటో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. 'విడాముయార్చి' మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చాలా రోజులుగా పుకార్లు వస్తున్నాయి కానీ, చిత్ర నిర్మాతల నుండి అఫిషియల్ కన్ఫర్మేషన్ లేదు. అలానే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అబుదాబిలో జరుగనుందని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ ఫొటోతో అన్నిటికీ క్లారిటీ వచ్చేసిందని అభిమానులు భావిస్తున్నారు.


గతంలో అక్కినేని నాగార్జున నటించిన 'చంద్రలేఖ' సినిమాలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన సంజయ్ దత్.. 'KGF 2' చిత్రంతో విలన్ గా సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం రామ్ - పూరీ జగన్నాథ్ కాంబోలో రూపొందే 'డబుల్ ఇస్మార్ట్' లో నటిస్తున్నాడు. అలానే తలపతి విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లియో' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఆంటోనీ దాస్ పాత్రలో దత్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ఆకట్టుకుంది. 


లియో రిలీజ్ అవ్వకముందే అజిత్ కుమార్ 62వ చిత్రంలో విలన్ గా నటించడానికి సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అజిత్ - దత్ కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చింది. మరి త్వరలోనే వీరిద్దరి సహకారాన్ని నిజం చేస్తూ, 'విదాముయార్చి' మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.


అజిత్ చివరగా 2023 సంక్రాంతికి 'తునివు' సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. దీని తర్వాత విఘ్నేష్ శివ‌న్ దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉండేది. కానీ కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది. దీంతో మగిజ్ తిరుమేని లైన్ లోకి వచ్చాడు. తాడయ్యరా తాక్క, మేఘమాన్, తడమ్, కలగ తలైవన్ చిత్రాలతో దర్శకుడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అజిత్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.


'విడా ముయర్చి' చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. కథానుగుణంగా ఇద్దరు హీరోయిన్స్ ఉండగా.. అందులో త్రిష కృష్ణన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలానే అరుణ్ విజయ్, అర్జున్‌ దాస్ లు కీలక పాత్రలో నటిస్తారని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తారు. నిర‌వ్ షా సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారు.


Also Read: 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటానని అనుకోలేదు: సమంత



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial