ల్లు అర్జున్ టైమ్ బాగుంది. ఈ ఏడాది బన్నీ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకపోయినా.. నిత్యం ట్రెండింగులో ఉంటున్నాడు. ముఖ్యంగా జాతీయ అవార్డు అందుకున్న తర్వాత బన్నీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అంతేకాదు.. బన్నీపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది. వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోన్న ‘పుష్ప: ది రూల్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోవడమే ఇందుకు కారణం.


ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, కేరళలో సైతం బన్నీకి భారీ స్థాయిలో అభిమానులు ఉండేవారు. అయితే, ‘పుష్ప: ది రైజ్’ మూవీ తర్వాత అల్లువారి కీర్తి ఎల్లలు దాటింది. అప్పటి నుంచి నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటున్నాడు అర్జున్. ఇక అసలు విషయానికి వస్తే.. బన్నీకి త్వరలోనే మరో అరుదైన గుర్తింపు లభించనుంది. దక్షిణాది సినీ రంగంలో ఇప్పటివరకు ఆ ప్రత్యేకతను పొందిన మూడో హీరోగా అల్లు అర్జున్ ఛాన్సు కొట్టేయనున్నాడు. మహేష్ బాబు, ప్రభాస్ సరసన ఠీవిగా నిలబడనున్నాడు. ఇంతకీ ఏమిటా ప్రత్యేకత అనేగా మీ ప్రశ్న? 


అది మారెంటో కాదు.. లండన్‌లో సుప్రసిద్ధ మేడమ్ టుస్సాడ్స్‌లో బన్నీకి సైతం మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఇది నిజంగా అల్లు అర్జున్ అభిమానులు పండుగ చేసుకొనే న్యూసే. ఇప్పటివరకు ఆ ఛాన్స్ మన దక్షిణాది నుంచి ఇద్దరు టాలీవుడ్ నటులకే దక్కింది. ప్రభాస్, మహేష్ బాబుల మైనపు విగ్రహాలు ఇప్పటికే అక్కడ కొలువదీరాయి. త్వరలోనే అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా మనం అక్కడ చూసే అవకావశం వస్తుంది. 


బాలీవుడ్ నుంచి ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనె, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్‌ల మైనపు బొమ్మలు ఆ వ్యాక్స్ మ్యూజియంలో ఉన్నాయి. జీవం ఉన్న మనుషులను తలపించే ఆ మైనపు విగ్రహాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు ఈ మ్యూజియంను సందర్శిస్తుంటారు. అలాంటి మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడమంటే నిజంగానే గ్రేట్.


69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడి అవార్డు


జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. 69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. ఇదే సినిమాకిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌ అవార్డుకు ఎంపిక అయ్యారు. ‘పుష్ప: ది రైజ్‌’ సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది. ఈ యాక్షన్-థ్రిల్లర్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ‘పుష్ప 2’లో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక 'పుష్ప1'కి ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడంతో 'పుష్ప 2'ను భారత్ తో పాటు పలు దేశాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.


Read Also: డిలీటెడ్ సీన్లతో ‘జవాన్’ ఓటీటీ విడుదల, అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన దర్శకుడు!